ఏపీకి షాకిచ్చిన కేంద్రం- ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమంటూ క్లారిటీ
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే ప్రసక్తే లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే స్పష్టం చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాను ఇదివరకు చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంది. ప్రైవేటీకరించాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని తేల్చి చెప్పింది. దీన్ని పునఃసమీక్షించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. లిఖితపూరక సమాధానం ఇచ్చింది.
వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థేతేల్చి చెప్పారు. ఇవ్వాళ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించదలచుకోలేదని వివరించారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోన్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని విరమింపజేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తోన్నామని అన్నారు. తమ ఆధీనంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అధికారులు- విశాఖ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలతో చర్చిస్తోన్నారని చెప్పారు.

2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వంద శాతం మేర పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. దీనికి కేంద్ర మంత్రివర్గం కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఫగ్గన్ సింగ్ కులస్థే వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనేది తమ విధానపరమైన నిర్ణయని అన్నారు.
ఆర్ఐఎన్ఎల్ కు సంబంధించి నంత వరకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని ఫగ్గన్ సింగ్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 4,930 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీపీఎం సభ్యుడు వీ శివ దాసన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2,751.34 కోట్ల రూపాయల మేర నష్టాల్లో ఉందని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుకింగ్ కోల్, ఐరన్ ఓర్ కొరతను ఎదుర్కొంటోందని, దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందని ఫగ్గన్ సింగ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్టింగ్ షాప్ను ఆధునీకరించి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications