పవన్ కల్యాణ్పై చంద్రబాబు ఆదేశాలు: నారా లోకేషను ఉద్దేశించే..
Recommended Video
విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు. తన ఆంద్రప్రదేశ్ పర్యటనలో పవన్ కల్యాణ్ చంద్రబాబుపైనా, ఆయన ప్రభుత్వంపైనా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు. కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై ఆయన వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ను ఉద్దేశించేనా...
పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా చర్చ సాగుతోంది. నారా లోకేష్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో జగన్తో పొత్తు పెట్టుకోనని పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చునని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని, విమర్సలు చేస్తే ఆటంకం ఏర్పడవచ్చునని ఆయన భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ సానుకూలంగానే...
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును పవన్ కల్యాణ్ సానుకూలంగా అర్థం చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. కొన్ని సందర్భాల్లో విమర్శిస్తున్నా, సంయమనం పాటించాలని సూచించారు. పవన్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను వాళ్లే చూసుకుంటాని, అది మనకెందుకు అని అన్నారు.
జగన్పై చంద్రబాబు ఎదురుదాడి
పట్టిసీమను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్షం పోలవరంపై అవాస్తవాలు, అబద్ధాలు, అభూతకల్పనలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు జగన్పై ఎదురుదాడికి దిగారు. ప్రాజెక్టుపై అభూతకల్పనలు ప్రచారం చేస్తే సహేతుకంగా, నిజాయితీగా సమాధానం చెప్పాలని ఆయన సూచించారు.
కూలీ పనులు చేస్తామంటున్నారు..
ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరతామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలి పని చేస్తామని రైతులు సందేశాలు పంపుతున్నారని ఆయన చెప్పారు. వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.