పవన్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు: ముగ్గురిని ఎంపిక చేసిన చంద్రబాబు: ఉత్తరాంధ్ర నేతలకు బాధ్యతలు..!
ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో జరిగే ఈ మార్చ్ లో పాల్గొనాలి అన్ని పార్టీలను పవన్ ఆహ్వానించారు. అయితే బీజేపీ..వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించటం మినహా..మార్చ్ లో పాల్గొనలేమని తేల్చి చెప్పాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మత్రం పవన్ ఆహ్వానం మేరకు తమ పార్టీ నేతలు మార్చ్ లో పాల్గొంటారని ప్రకటించారు. దీనికి అనుగుణంగానే మార్చ్ లో పాల్గొనేందుకు ముగ్గురు నేతలను చంద్రబాబు ఎంపిక చేసారు. ఉత్తరాంధ్రకు చెందిన ఈ నేతలకే చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేసినా తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు..ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక, ఈ మార్చ్ లో జనసేనతో పాటుగా టీడీపీ..లోక్ సత్తా నేతలు హాజరు కానున్నారు.
టీడీపీ నుండి ముగ్గురు నేతలు ఎంపిక..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించనున్న లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పవన్ కళ్యాన్ స్వయంగా ఫోన్ చేసి తమను ఆహ్వానించారని.. ప్రభుత్వానికి వ్యతిరేంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేసే ఏ పార్టీకి అయినా మద్దతుగా నిలుస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. అయితే, స్థానికంగా ఉన్న కార్యకర్తలను కాకుండా..కేవలం పార్టీ ప్రతినిధులుగా నేతలను మాత్రమే మార్చ్ లో పాల్గొనేలా పంపాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

అందు కోసం ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ సీనియర్లను ఎంపిక చేసారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడును జనసేనాని నిర్వహించే మార్చ్ కు వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. విశాఖ కు చెందిన గంటా తో పాటుగా అయ్యన్న పాత్రుడు అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు ఉండటంతో ఆ జిల్లా నుండి అచ్చెన్నాయుడును పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే బీజేపీ..వామపక్షాలు ఈ మార్చ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు టీడీపీ మాత్రమే అధికారికంగా మద్దతు ప్రకటించింది.
భవిష్యత్ లోనూ కలిసే పోరాటాలు...
ఇప్పుడు జనసేన నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు ప్రకటించటం ద్వారా చంద్రబాబు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.2014 ఎన్నికల్లో పవన్..బీజేపీతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన టీడీపీ..2019 ఎన్నికల్లో పవన్ తో దూరంగా ఉంది. ఇప్పటికిప్పుడు బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి లేకపోవటంతో పవన్ తో స్నేహం కొనసాగించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ..ఇతర పార్టీలు నిర్వహించే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు మద్దతు ఇస్తామని చంద్రబాబు వ్యూహాత్మక ప్రకటన చేసారు. ఏపీలో జనసేన..బీజేపీ మాత్రమే ఇప్పుడు టీడీపీ తరువాత క్రియాశీలకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు జనసేన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటం ద్వారా భవిష్యత్ తో తాము నిర్వహించే నిరసన కార్యక్రమాల్లోనూ జనసేనను భాగస్వాములను చేయటం ఇందులో అసలు వ్యూహంగా కనిపిస్తోంది. జనసేనకు సైతం తమకు మద్దతుగా నిలిచిన పార్టీతో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో..వైసీపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు భవిష్యత్ లో ఉద్యమాలు..పోరాటాలకు సిద్దం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications