టీడీపీలో వారికి టికెట్లు లేనట్లేనా - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
పార్టీలో టికెట్ల కేటాయింపు పైన టీడీపీ అధినేత చంద్రబాబు గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కఠినంగా ఉంటున్నారు. గతంలో నామినేషన్ల చివరి సమయం వరకు అభ్యర్ధుల ఎంపిక పైన నిర్ణయం జరిగేది కాదు. కానీ, ఇప్పుడు ముందే అన్నీ సెట్ చేస్తున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు అని స్పష్టం చేసిన చంద్రబాబు.. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరిగి ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో.. సిటింగ్ ఎమ్మెల్యేల్లో జోష్ పెరిగింది. కానీ, దాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల పని తీరు పైన చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.

గతం కంటే భిన్నంగా చంద్రబాబు
కొద్ది రోజులుగా చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నేరుగానే వారితో తాను సర్వేల ద్వారా సేకరించిన సమాచారం.. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను వారి ముందు ఉంచుతున్నారు. ప్రధానంగా వైసీపీ బలంగా ఉన్న సీమ జిల్లాలతో పాటుగా కోస్తాలోని రెండు జిల్లాల్లో పరిస్థితుల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా.. 46 మంది ఇన్చార్జులతో చంద్రబాబు సమావేశం అయ్యారు.
పాణ్యం, బనగానపల్లి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు గౌరు చరితా రెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బడేటి రాధాకృష్ణలతో నేరుగా పార్టీ పరిస్థితుల పైన చర్చించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులు..నేతల పని తీరు పైనా తాను అనేక మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని వారి ముందు ఉంది వివరణ తీసుకున్నారు.

అనేక మార్గాల్లో క్షేత్ర స్థాయి సమాచారం
ఇంఛార్జ్ లు చెబుతున్న కారణాలు.. సమర్ధించుకొనే వాదనలను చంద్రబాబు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు పార్టీకి ఎంత కీలకమైనవో చంద్రబాబు వివరిస్తున్నారు. అదే సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి అయినా వెనుకాడేది లేదని తేల్చి చెబుతున్నారు.
పార్టీ కోసం పని చేస్తున్న వారిని కలుపుకొని పోవటంలో వెనుక బడి ఉన్నవారి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తాను ఆశించిన స్థాయిలో.. ప్రజలతో మమేకం కాని వారికి టికెట్లు ఇచ్చేది లేదని చంద్రబాబు మొహమాటం లేకుండా చెబుతున్నారు. పార్టీ ఆశించిన తీరులో పని చేయలేకపోతే తాము మరొకరిని చూసుకోవాల్సి వస్తుందని ఖరా ఖండిగా చెప్పటం ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు కారణమైంది.
తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని చెబుతూనే.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి గెలుపు ప్రతిష్ఠాత్మకమని స్పష్టం చేస్తున్నారు. కొందరి పని తీరు బాగుందనే పేరు ఉందని.. ఆ స్థాయిలో పేరున్న వారికే టికెట్లు ఇవ్వగలుగుతానని సుతి మెత్తగా తన మనసులోని మాటను వారికి అర్దమయ్యేలా స్పష్టం చేస్తున్నారు.

టికెట్లు ఇవ్వలేను..మూడు నెలలే సమయం
ఒక విధంగా వారిలో మార్పు రాకపోతే టికెట్ దక్కదనే విషయం వారికి అర్దమయ్యేలా చెబుతున్నారు. కొందరి విషయంలో మాత్రం చంద్రబాబు మూడు నెలల సమయం ఇచ్చారు. ఆ సమయంలో పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. టికెట్లు దక్కని వారికి పార్టీ అధికారంలోకి వస్తే ఇతరత్రా అవకాశాలు దక్కుతాయని చెబుతున్నారు.
దీని ద్వారా వారికి టికెట్ల విషయంలో ఇప్పటికే చంద్రబాబు నిర్ణయానికి వచ్చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దాదాపుగా 45 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ ల విషయంలో ఇప్పుడు పార్టీలో చర్చ సాగుతోంది.
ముందుగానే టికెట్ల విషయంలో క్లారిటీ ఇవ్వటం ద్వారా వచ్చే నియోజకవర్గాల్లో అభ్యర్ధులు పని చేసుకుంటారని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గాల ఇంఛార్జ్ ల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications