కేంద్రానికి చంద్రబాబు లేఖ - కేంద్రం ఎంతో సహకరించింది : వైసీపీ నిర్ణయాలతో నష్టం..!!
వైసీపీ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రికి చంద్రబాబు లేఖ రాసారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని కోరారు. పోలవరం పై కేంద్రం, పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేసారు.

కేంద్రం పూర్తిగా సహకరించినా
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదాతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎంతో సహకరించిందని లేఖలో పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఎపికి బదిలీ చేయడం ప్రాజెక్టుకు మేలు జరిగిందని గుర్తు చేసారు. నీతి-అయోగ్ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అద్భుతమైన పురోగతిని నమోదు చేయడంలో సహాయపడిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని టీడీపీ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 71 శాతం పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తన ఉద్దేశ్య పూర్వక, అసమర్థ నిర్ణయాల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానని లేఖలో చంద్రబాబు ఆకాంక్షించారు.

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం వెనుక
మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలచుకుంటే తనకు చాలా బాధగా ఉందన్నారు. వైసిపి నేతృత్వంలోని అధికారం చేపట్టిన నాటి నుంచి స్వార్థ ప్రయోజనాలతో ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రాధాన్యతలతో ముందుకెళుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజే అంటే జూన్ 1, 2019 న, భారత ప్రభుత్వ సంస్థల నుండి ఆమోదం పొంది పోలవరం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను మార్చాలని నిర్ణయించిందని గుర్తు చేసారు. రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబర్ లో పనులు మరొక ఏజెన్సీకి అప్పగించారని వివరించారు. ఆకస్మికంగా పనులు నిలిపేయడంతో టెండర్ల ప్రక్రియ ముగిసి కొత్త ఏజెన్సీ పనులు చేపట్టేందుకు ఆరు నెలల సమయం పట్టిందన్నారు. ఈ ఆరు నెలల్లో ప్రాజెక్ట్ వద్ద ఏ ఏజెన్సీ కూడా ప్రాజెక్టు పనులను పర్యవేక్షించలేదని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో వివరించారు. కాంట్రాక్టర్ ను మార్చే క్రమంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టలేదని.. ఈ కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.

నష్టాన్ని ప్రజల ముందుంచాలి
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. నిర్మాణం ఆలస్యం కారణంగా ప్రాజెక్టుల ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక తప్పిదాలు, పర్యవేక్షణ లేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంతో పునరావాస ఖర్చులు పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో ప్రాజెక్టు నిర్మాణంలో చాలా జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు.ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించారని గుర్తు చేసారు. తరువాత దానిని డిసెంబర్ 2021 వరకు పొడిగించారని,. దానిని మరలా జూన్ 2022కి మార్చారని చెప్పారు. జూన్ 2019 నుంచి పోలవరం ప్రాజెక్ట్ లో జరిగిన జాప్యం, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. సంఘటనలపై క్షుణంగా అధ్యయనం చేసి జాప్యం, తత్ఫలితంగా దేశానికి కలిగిన నష్టాన్ని ప్రజల ముందుంచాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు.












Click it and Unblock the Notifications