కౌంట్డౌన్ స్టార్ట్ - వారికి గుడ్ బై, చంద్రబాబు వార్నింగ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పార్టీ నేతలకు అప్రమత్తం చేసారు. కొందరి తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్తెనపల్లి పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణం అంశాన్ని ప్రస్తావించారు. నేరస్తుల్ని నేరస్థులుగానే చూస్తామని తేల్చి చెప్పారు. ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని... ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు నిర్దేశించారు. 2014-19 కాలంలో రాజకీయం వదిలేసిన కారణంగా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చారు.
జగన్ తీరుపై
పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారని వ్యాఖ్యానించారు. తన కారు కిందే కార్యకర్త పడిపోతే.. పక్కకు పడేసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన తర్వాత కూడా సొంత మీడియా ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తారా అంటూ నిలదీసారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచుల వద్దకు వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. చేస్తున్న మంచి పనులతో పాటు, మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆర్ధిక ఉగ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని ఏరి పారేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీలు ఏం చేశారో జనానికి అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచించారు.

2019 ఓటమి వెనుక
ఆనాడే వివేకా హంతకులను పట్టుకుని ఉంటే.. 2019 ఎన్నికల్లో ఓడిపోయేవాళ్లం కాదని చంద్ర బాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల హడావుడి పక్కన పెట్టి 2గంటలు వివేకా హత్య పై శ్రద్ధ పెట్టి రికార్డులు సీజ్ చేసి ఉంటే 2019లో మనమే గెలిచేవాళ్ళమని చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరిన్ని డ్రామాలకు తెరలేపుతున్నారున్నారు. ప్రజలు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్ను కాపాడుకో వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజల్లో తృప్తి చూస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోలేకపోవటం మనకున్న లోపమని, 2014-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవటంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకే జులై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు.
మీ తీరు మారాలి
గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని చెప్పుకొచ్చారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతల పనితీరుపై సమాచారం తెప్పించు కుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి.. వాస్తవాలను బేరీజు వేస్తున్నానన్నారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాని, రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతు న్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, ఎమ్మెల్యేల పనితీరు మారాలని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications