టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
ఏపీలో నామినేషన్లు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఈ సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు..టీడీపీలో పోటీ చేసే అభ్యర్దుల మార్పు పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు అభ్యర్దుల మార్పు ఖాయమైంది. రఘురామ రాజును ఉండి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉండి అభ్యర్దిగా ప్రకటించిన రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. నరసాపురం సిటింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు. ఈ క్రమంలో రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది.

మాడుగులలో అంతకు ముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర(ఎస్సీ)లో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్ను మార్చాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇవ్వనున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు.
జయచంద్రారెడ్డి ప్రచార రంగంలో వెనుకబడిపోయారు. పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. ఇంకో 3-4 స్థానాల్లో మార్పులు చేయాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇన్చార్జులకు బదులు వారి పిల్లలకు టికెట్లు ఇచ్చారు. ఈ రెండు చోట్లా తిరిగి వారి తండ్రులకే ఇస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. దీంతో...మార్పుల పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications