కస్టడీలో టీడీపీ కార్యకర్తలపై దాడి-రఘురామ తరహాలో-ఎవరినీ వదిలిపెట్టబోమన్న చంద్రబాబు..
పుంగనూరులో అరెస్టైన టీడీపీ కార్యకర్తల్ని పీలేరు సబ్ జైల్లో చంద్రబాబు ఇవాళ పరామర్శించారు. అనంతరం జైలు బయటికి వచ్చిన చంద్రబాబును పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులు కలిశారు. అకారణంగా అక్రమ కేసులతో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారని ఆయనకు వారు వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, ఏడుగురు మైనారిటీ వ్యక్తులపై కేసులు పెట్టారని, అయ్యప్ప భక్తుడిపైనా కేసు పెట్టి జైల్లో పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 21 ఏళ్లు ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న పఠాన్ రియాజ్ ఖాన్ అనే యువకుడిపై కేసు పెట్టారని, ఏ కారణాలూ లేకుండా ఎఫ్ఐఆర్ లో ఇతరులు అని చేర్చి 8 మందిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టు చేసిందే కాక స్టేషన్ కు తీసుకొచ్చి వారిని హింసించారన్నారు.ఎంపీ రఘురామరాజును కొట్టినట్లుగా ఇక్కడి సీఐ, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారిపై నీచంగా కొట్టి, భయపెట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. మెజిస్ట్రేట్ వద్ద కొట్టినట్లు చెప్తే కాల్చేస్తాం, కేసులు పెట్టి తిప్పుతాం అని బెదిరించారన్నారు. దీనికంటే ఉగ్రవాద చర్య మరొకటి ఉంటుందా.? పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు? అని ప్రశ్నించారు.
ఖాకీ బట్టలు వేసుకున్న వాళ్లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, వీళ్లందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మైనారిటీలను అరెస్టు చేసిందేకాక..ఇతరుల పేర్లు చెప్పాలని టార్చర్ పెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని, పోలీసులు చట్టాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారని ప్రశ్నించారు. ఖబడ్దార్ గుర్తుంచుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి, కొందరు చట్టానికి చుట్టాలు కాదన్నారు.
చల్లా బాబు జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టారని,వైసీపీ దొంగలు వచ్చి ప్లెక్సీలను చించేశారన్నారు. ప్లెక్సీలు చించేస్తుంటే పోలీసులు ఏం గాడిదలు కాస్తున్నారా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వైసీపీ ప్లెక్సీలు చించితే పోలీసులు మమ్మల్ని వదిలిపెడతారా.? అని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లే పెక్సీలు చించి వాళ్లే కేసులు పెట్టారన్నారు. ఎందుకు ఏకపక్షంగా వ్యవహిరించారని అడిగిన పాపానికి మా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారన్నారు. ఉయ్యాల జ్యోతి, ఉయ్యాల కిషోర్, నాగార్జున నాయుడు, అక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. రొంపిచర్ల ఎస్ఐ సహకారంతో 145, 147, 307, 324 వంటి రకరకాల ఐపీసీ సెక్షన్ల కింద 11 మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో ఎవరూ పర్యటించకూడదా.? గతంలో రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, షర్మిళ కూడా తిరిగారని, జగన్ రెడ్డి కూడా పాదయాత్రలు చేశాడని, కానీ తాను ఎప్పుడూ..ఎక్కడా అడ్డంకులు సృష్టించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. తప్పుడు కేసులు పెడుతున్నారని మైనారిటీ సోదరులకు చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పటికే 50 మందికి పైగా ముస్లిం సోదరులపై దాడులు చేశారని, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపులు తాళలేక రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, ప్రతిఘటిస్తే చంపేస్తున్నారన్నారు. పండగపూట చెప్తున్నా..నా కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టావు పెద్దిరెడ్డి. నేను కూడా ఈ రోజు పండగ జరుపుకోకుండా జైలు వద్దకు వచ్చా. ప్రజలు కూడా పండగ నాడు జైలు వద్దకు వచ్చారన్నారు.పెద్దిరెడ్డీ నీ పని, వైసీపీ పని అయిపోయింది, అందుకే సైకో పోవాలి..సైకిల్ రావాలి అనేది ఇంటింటి నినాదం అయిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి, రాక్షసానందం పొందడం సైకోలు తప్ప మరెవరైనా చేస్తారా? వేరే రాష్ట్రాల నుండి మద్యం తెచ్చి దొంగ వ్యాపారం చేసే వాళ్లను జైల్లో పెట్టాలన్నారు.
మమ్మల్ని బాధపెట్టిన వాళ్లను వదిలిపెట్టం. నూటికి 95 శాతం మంది పోలీసులు మంచివాళ్లు ఉన్నారు. కానీ కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రొంపిచర్ల ఎస్ఐ. కల్లూరు సీఐ ఎలా తప్పించుకుంటారో చూస్తానన్నారు. మీ ఇష్ట ప్రకారం కొట్టి తిడతారా? అమ్మ, అక్క అని తిడతారా.? నేను కూడా బూతులు మాట్లాడితే ప్రజలు మీ మొహాన ఉమ్ముతారన్నారు. పోలీసుల ఆటలు సాగుతున్నాయని తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు మనుగడ లేదని, నన్ను పీలేరు రాకుండ అడ్డుకుంటారా? - నేను ఎక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? అని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టమన్నారు.