బీజేపీకి రాజ్యసభ ఆఫర్, బదులుగా చంద్రబాబు కోరికల చిట్టా!
విజయవాడ: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను మూడు తెలుగుదేశం, ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశమున్నాయి. ఆయా పార్టీల బలం చూస్తే మూడు టిడిపి, ఒకటి వైసిపి గెలుచుకుంటుంది. టీడీపి తమ ఖాతాలోని ఓ స్థానాన్ని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశముంది.
ప్రస్తుతం కేంద్ర వాణిజ్య మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఏపీ నుంచి ఆమెను రాజ్యసభకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బీజేపీకి ఇచ్చే ఓ స్థానంలో.. నిర్మలా సీతారామన్కే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును కర్నాటక నుంచి మరోసారి పంపించారని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి నిర్మలకు అవకాశం రావొచ్చునని చెబుతున్నారు.
ఓ రాజ్యసభ స్థానాన్ని తమకు ఇవ్వాలని బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబును అడిగిందా లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. అయితే, నిర్మలను ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే విషయమై చంద్రబాబుతో మాట్లాడినట్లు వెంకయ్య నాయుడు చెప్పారని తెలుస్తోంది.

మూడో స్థానం బీజేపీకి ఇవ్వకుంటే తమకు ఇవ్వాలని తెలంగాణ టిడిపి నేతలు పట్టుబడుతున్నారు. అయితే, బీజేపీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఏపీ కొత్త రాష్ట్రమైనందున ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఏపీలో టిడిపి - బీజేపీలు మిత్రపక్షాలు. రాష్ట్రానికి కేంద్రం సహకారం, ఇతర కారణాల దృష్ట్యా బీజేపీతో సత్సంబంధాలకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి తప్పనిసరిగా రాజ్యసభ ఇచ్చే అవకాశముంది.
అయితే, బీజేపీకి రాజ్యసభను కేటాయిస్తే చంద్రబాబు ఆ పార్టీ ముందు కోరికల చిట్టా విప్పనున్నారని తెలుస్తోంది. బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇస్తామని, అయితే టిడిపి నేతలకు నామినేటెడ్ పదవులు, గవర్నర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారని తెలుస్తోంది. అయితే, ప్రత్యేక హోదా గురించి కూడా అడిగితే బాగుంటుందని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications