కేంద్రమంత్రికి బాబు ఫోన్, రాజధానిపై పల్లె
హైదరాబాద్: కేంద్ర మంత్రి అనంతకుమార్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్ చేశారు. రాష్ట్రానికి 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వినతికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
వీజీటీఎం పరిధిలోనే రాజధాని: పల్లె
ఆంధ్రప్రదేశ్ రాజధాని వీజీటీఎం ( విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి) పరిధిలోనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. వీజీటీఎం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన కేంద్రమని ఆయన అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారానే భూసేకరణ చేపడతామని తెలిపారు.
రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు రైతులు పూర్తిగా సహకరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. రైతుకు మెరుగైన ప్రయోజనాలు అందించిందేకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రుణమాఫీ అంశంలో రైతులు ఆందళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని తెలిపారు.