నిలబడుతుందా..? నీరుగారుతుందా..? : అసలేంటీ క్వాష్ పిటిషన్?
విజయవాడ : ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు పునర్విచారణ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతీ కదలిక చర్చనీయాంశంగా మారుతోంది. కేసు నిలబడుతుందా..? చంద్రబాబు విచారణకు హాజరవడం అయ్యే పనేనా..? అన్న లెక్కల్లో ప్రతీ ఒక్కరు తలమునకలైపోయారు. మరోవైపు విచారణపై 'స్టే' తెచ్చుకునేందుకు చంద్రబాబు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
ఏసీబీ కోర్డు విచారణపై స్టే విధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అసలు క్వాష్ పిటిషన్ ఎలాంటి సందర్బంలో దాఖలు చేస్తారు? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీలో సెక్షన్ 482 కింద సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో గానీ క్వాష్ పిటిషన్ వేసే వెసలుబాటు ఉంది.
తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్న కేసులో.. ఫోరెన్సిక్ ల్యాబ్ లు సైతం ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని నిర్దారణ చేశాక కూడా ఆయన క్వాష్ పిటిషన్ తో ముందుకెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఏసీబీ ఉత్తర్వుల్లో చంద్రబాబు పేరుందా!
ఇక ఏసీబీ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. అందులో ఎక్కడా చంద్రబాబు పేరును పేర్కొనలేదు. పిటిషన్ దారైన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న సాక్ష్యాధారాలను పోలీసు అధికారులకు ముందుంచాలని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను పిటిషన్ లో జతచేసిన సంగతి తెలిసిందే.
సదరు సాక్ష్యాధారాలన్నింటిని పరిశీలించి, వాటిపై విచారణ జరిపి నెలరోజుల్లోగా నివేదికను అందజేయాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఏసీబీ ఉత్తర్వుల్లో 'అసలు చంద్రబాబు పేరే ప్రస్తావించకోపోయినా.. చంద్రబాబు మాత్రం విచారణపై స్టే విధించాలని ప్రయత్నిస్తుండడాన్ని కోర్టులు పరిగణలోకి తీసుకోవని చెబుతున్నారు పలువరు న్యాయ నిపుణులు'.
ఏసీబీ ఉత్తర్వుల్లో పోలీసు విచారణకు ఆదేశాలు జారీ చేశారే తప్పితే.. ప్రత్యేకంగా చంద్రబాబు పేరునేమి ప్రస్తావించకపోవడంతో.. చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలు కోర్టుల ముందు నీరు గారిపోయేవే అన్న అభిప్రాయాలు న్యాయ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications