ముస్లిం రిజర్వేషన్లపై తేల్చేసిన టీడీపీ - మోడీ సమక్షంలోనే స్టాండ్ క్లియర్..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చర్చనీయాంశమైన అంశాల్లో ముస్లిం రిజర్వేషన్లు కూడా ఒకటి. ముఖ్యంగా బీజేపీ రిజర్వేషన్లను తీసేసేందుకు ప్రయత్నిస్తోందంటూ పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ప్రచారం చేయడం, ముస్లిం రిజర్వేషన్లను మాత్రం ఎత్తేస్తామంటూ బీజేపీ నేతలు ఇచ్చిన కౌంటర్ ఏపీలోనూ ముస్లింలను కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ ఎన్డీయే భాగస్వామి టీడీపీ తన వైఖరి తేల్చేసింది.
రాష్ట్రంలో గతంలో వైఎస్ హయాంలో తెచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బీజేపీ జాతీయ స్ధాయిలో పోరాటం చేస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో సైతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాము ఎన్నికల్లో గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనలతో ఏపీలో ఎన్డీయే కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన ఇరుకునపడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ సైతం ముస్లిం వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి రిజర్వేషన్లు తొలగించకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ముస్లింలు బీజేపీతో పొత్తును సైతం పట్టించుకోకుండా ఎన్డీయేకు అండగా నిలిచారు.

ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో కేంద్రం రిజర్వేషన్ల తొలగింపు చేపట్టే ప్రమాదం ఉందని భావిస్తున్న వేళ.. ఎన్డీయే పక్షాల భేటీలోనే ముస్లిం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుకు అంగీకరించబోమని మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్రమోడీతో పాటు ఇతర బీజేపీ పెద్దలకు తేల్చిచెప్పేశారు. దీంతో ముస్లిం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకుంటున్నట్లయింది.

అదే సమయంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నారా లోకేష్ సైతం ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు బుజ్జగింపు కాదని సామాజిక న్యాయమని అభివర్ణించారు. బీజేపీతో పొత్తుకన్నా రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో సామాజిక పరంగా ముస్లింలు వెనుకబడి ఉన్నారని, వారి తలసరి ఆదాయమే ఇందుకు నిదర్శమని లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications