ఏరియల్ సర్వే చేసిన బాబు, విశాఖలో సమీక్ష
విశాఖపట్నం: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సర్వే చేసిన ఆయన అక్కడి పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.హుధుద్ తుపాను వల్ల కకావికలమైపోయిన బాధిత ప్రాంతాలలో అమలు జరుగుతున్న సహాయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంనుంచే పర్యవేక్షిస్తున్నారు.
ఇక్కడినుంచే ఆయన అందరికీ ఆదేశాలు ఇస్తున్నారు. విశాఖ చేరుకున్న మంత్రులు కూడా ఇక్కడినుంచే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.ఈ గడ్డుకాలంలో తుపాను బాధిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలు అమలు చేయడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.

ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎవరమూ గతంలో చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత అంటూ ఇప్పటికే విజయవాడ, గుంటూరులనుంచి పెక్కుమంది అధికారులు విశాఖపట్నం చేరుకున్నారని, వారు సహాయ కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్నారని ఆయన వివరించారు.
సహాయక చర్యల అమలుకు ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులను నియమించినట్టు, వారికి పది సహాయక బృందాలను కేటాయించినట్టు ఆయన చెప్పారు. ఇపడు క్షేత్ర స్థాయిలో ఉన్న బృందాలే కాక అదనంగా మరో 20 సహాయక బృందాలను రంగంలోకి దించుతున్నట్టు ఆయన వెల్లడించారు.
కొన్ని చోట్ల నిత్యావసర సరకులను విపరీతంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుకు బాబు స్పందిస్తూ అధికారులు రంగంలోకి దిగారని, ప్రతి ఒక్కరికీ ఆహారం అందించే దిశగా సర్వశక్తులూ కూడదీసుకుని నిత్యావసర సరకులు అందరికీ అందేటట్టు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications