వద్దంటారు, ఎక్కడంటే చెప్పరు: జగన్పై విరుచుకపడిన చంద్రబాబు
గుంటూరు: పేరెత్తకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. రాజధాని ఇక్కడ కడతామంటే వద్దంటారని, ఎక్కడ కట్టాలంటే చెప్పరని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, కృష్ణా డెల్టాకు నీరిచ్చి, రాయలసీమకు తరలిస్తామంటే కాదంటున్నారని, రాయలసీమకు నీరిస్తే తమ మాట వినరని భావిస్తున్నారని, ప్రజలు ఎప్పుడూ వారి పాలెగాళ్లుగానే ఉండాలని భావిస్తున్నారని ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు.
శాసనసభలో వారి ప్రవర్తన అసభ్యంగా ఉందని, దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రాయలసీమలో ముఠాకక్షలను, రౌడీయిజాన్ని కఠినంగా అణచివేస్తామని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులో ఉందని, బిజెపి కేంద్ర ప్రభుత్వంలో మన మంత్రులున్నారని, వారు మాట్లాడుతున్నారని, కేంద్రం పూర్తిగా సహకరిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. తాము ఇబ్బందులను కోరి తెచ్చుకోలేదని, అది గత కేంద్ర ప్రభుత్వం చేసిన పని అని ఆయన అన్నారు.

బెంగళూర్, చెన్నై, హైదరాబాద్ నగరాలకు సమానంగా ఎపి రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలంటే కేంద్ర సాయం అవసరమని, అటువంటి నగరం తయారయ్యే వరకు కేంద్రం ఆర్థికంగా మనకు సహకరించాలని ఆయన అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకే రాజధానికి భూసమీకరణ చేపట్టామని ఆయన అన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమానంగా ఎపి ఎదగాలని, అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ప్రపంచమంతా మన వైపు చూడాలని ఆయన అన్నారు.
ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ తనకు మొక్కవోని ధైర్యం ఉందని, అనుకున్నది సాధించే వరకు నిద్రపోనని ఆయన అన్నారు. 1994లో హైదరాబాదులో జీతాలు ఇవ్వలేని స్థితి ఉండేదని, అప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాదును తీర్చి దిద్దామని ఆయన చెప్పుకున్నారు. శాతవాహనుల వంటి చక్రవర్తులు ఏలిన అమరావతి ఉందని, అటువంటి ఉన్నతమైన నగరాన్ని ఏర్పాటు చేసేవరకు విశ్రమించబోనని ఆయన అన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చామని, మీరంతా సహకరిస్తే అనతి కాలంలోనే అనుకున్నది సాధిస్తామని ఆయన అన్నారు.
ఈ రోజు కష్టాలున్నాయి, అధైర్యపడాల్సిన అవసరం లేదని, ముందుకు దూసుకెళ్తామని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేశారని, దుర్మార్గాన్ని గట్టిగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామంటే, హైదరాబాదు రోడ్లు విశాలం చేస్తామని వద్దన్నారని, తాను అనుకున్నది సాధిస్తామని, ఎవరు చెప్పినా వెనక్కి తగ్గనని, ఎపి అగ్ర రాష్ట్రంగా తీర్చి దిద్తుతానని ఆయన అన్నారు.
ఒక పక్క కృష్ణానదీ తీరంలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకుంటున్నామని, ఇక్కడి వాతావరణం చూస్తే తనకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. తుళ్లూరు ప్రాంత రైతాంగాన్ని తాను జీవితంలోనే ఎన్నటికీ మర్చిపోలేనన్నారు.
కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, జపాన్, సింగపూర్, జర్మనీ దేశాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరముందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉండాలన్నారు. హైదరాబాద్ లాగా మన రాష్ట్రంలో రెండు, మూడు నగరాలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా నిలుపుతామన్నారు. అన్ని వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయని, వాటితో అభివృద్ధి సాధిద్దామన్నారు.












Click it and Unblock the Notifications