పవన్ యూటర్న్! జగన్ను రెచ్చగొడుతున్నారు: కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం
నెల్లూరు: రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అంతేగాక, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమపై కేంద్రం రెచ్చగొడుతోందని మండిపడ్డారు.
మోడీ అంటే జగన్కు వణుకు
శుక్రవారం సాయంత్రం నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తమిళనాడులో దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు ఎదురైన పరిస్థితితో మోడీ పేరు ఎత్తాలంటేనే జగన్కు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
జైలుకు పోతాననే భయం
‘జగన్వి నాటకాలే నాటకాలు. 2015 నుంచి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామన్నారు. అదుగో రాజీనామా చేస్తా.. ఇదుగో రాజీనామా చేస్తా.. రేపే చేస్తా.. అన్నారు. చివరకు ఏం చేశారు? రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏమీ చెప్పకుండానే మద్దతు ఇచ్చారు. ఎందుకు అలా చేశారని అడుగుతున్నా. జగన్కు పిరికితనం, భయం. మోడీ మాట ఎత్తితే ఎక్కడ జైలుకు పోతాననో అనే భయం పట్టుకొని జగన్ ఈవిధంగా చేస్తున్నారు' అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
వైసీపీ ముసుగులో కేంద్రం
‘కేంద్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది. కుట్రదారులను, పాత్రదారులను ఓడించాలి. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ అభివృద్ధీ జరగలేదు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి కియా వచ్చింది. ఇషుజీ , హీరో మోటార్స్, అపోలో టైర్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీలు వచ్చాయి. రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్గా తయారుచేస్తున్నాం' అని చంద్రబాబు తెలిపారు.
పవన్ యూటర్న్.. జగన్ను రెచ్చగొడుతున్నారు..
‘అప్పుడే పుట్టిన బిడ్డలా మారిన రాష్ట్రాన్ని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో అన్ని విధాలా తగ్గి కేంద్రాన్ని అభ్యర్థించుకొనే పరిస్థితికి వచ్చాం. మేం అడిగినవి అసాధ్యమైన కోర్కెలా? గొంతెమ్మ కోర్కెలా? ప్రజల కోసమే అడుగుతున్నా. అలా అడిగితే.. జగన్ను రెచ్చగొడతారా? పవన్ నాపై యూటర్న్ తీసుకొని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల ద్వారా చెబుతున్నా.. దేశంలో మేరేం చేశారో.. రాష్ట్రంలో నేనేం చేశానో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా' అని చంద్రబాబు సవాల్ విసిరారు.