టిడిపిని దెబ్బతీయడమే లక్ష్యం: టిఆర్ఎస్పై చంద్రబాబు
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో గురువారం జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమి చేయలేరని అన్నారు.
తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ అని చంద్రబాబు అన్నారు. పార్టీ సమర్థవంతంగా పనిచేయాలని, ఏ పార్టీకి లేనంతమంది కార్యకర్తలు తమ పార్టీకి ఉన్నారని చెప్పారు. నిస్వార్థ కార్యకర్తలున్న ఏకైక పార్టీ టిడిపి అని అన్నారు. 25లక్షల మంది టిడిపి కార్యకర్తలను ఉపయోగించుకుని, వారిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని చంద్రబాబు తెలిపారు.
వీలైనంత త్వరగా పిఆర్సీని పెంచడంపై కమిటీ వేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. జన్మభూమి, హుధుద్ తుఫాను సహాయక చర్యల్లో ఉద్యోగస్తులు చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. 2019, 2022, 2029 వరకు ఏం చేయాలనే ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఏపిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
రాష్ట్రంలో అనేక సహజ వనరులున్నాయని, వెయ్యి కి.మీ తీరప్రాంతం ఉందని అన్నారు. 14 పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఏపిని ఎగుమతులు, దిగుమతులకు గేట్ వేగా తయారుచేస్తామని చంద్రబాబు తెలిపారు. దీని వల్ల అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు.
జిల్లాల్లో నిర్ణయించిన ప్రదేశాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లను నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని, కరువు ప్రాంతాలకు మళ్లించనున్నట్లు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లి భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధికి గల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారని చెప్పారు. తాను సింగపూర్ పర్యటించి ఏపిలో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు, అందుకు అక్కడి పారిశ్రామిక వేత్తలు సుముఖత వ్యక్తం చేసినట్లు చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications