ప్రజల ప్రాణాల కంటే ఎక్కువేంటి? క్యాబినెట్ భేటీలో కరోనాకు ప్రాధాన్యం లేదా ? జగన్ సర్కార్ పై చంద్రబాబు ధ్వజం
గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న కరోనా మహమ్మారి నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో డబుల్ మ్యూటాంట్ ఎన్440కే వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందని చెప్పిన చంద్రబాబునాయుడు తాజాగా జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజల ప్రాణాలుకాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది అని చంద్రబాబు విమర్శించారు.
ఏపీలో డేంజరస్ కరోనా వైరస్, సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారన్న చంద్రబాబు..లాక్ డౌన్ డిమాండ్!!
క్యాబినెట్ భేటీలో కరోనాకు ప్రాధాన్యమివ్వరా ? ప్రశ్నించిన చంద్రబాబు
జూమ్ మీటింగ్ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం తమ పని కాదని, కానీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఆవేదనతో మాట్లాడుతున్నామని వ్యాఖ్యానించారు.వ్యాక్సినేషన్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అతి తీవ్రమైన కరోనా సమస్యకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని చంద్రబాబు విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అజెండాలో ముప్పై మూడవ అంశంగా కరోనా నియంత్రణను చేర్చారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఏంటి ?
వేల కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు చేస్తున్నారని, కానీ కరోనా కట్టడిపై దృష్టి సారించడం లేదన్నారు చంద్రబాబు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించామని చెప్పిన చంద్రబాబు, కరోనా రెండో దశ చాలా ఉదృతంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే పక్క రాష్ట్రాలు భయపడుతున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఎన్ 440 వేరియంట్ ఏపీలో ఆందోళన కలిగిస్తోంది
కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్ 440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు, ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించింది అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని మాట్లాడుతుందని, కానీ రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన కరోనా సంక్షోభంలో చిక్కుకుందని చెప్పారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ నుండి తమవంతుగా కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తున్నామని, ఆన్లైన్ ద్వారా వైద్య సూచనలు సలహాలను ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఖరితో బాధతో పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించాం
ప్రభుత్వానికి ఎన్నో వనరులు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉన్నప్పటికీ, పట్టింపులేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో బాధతో పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించామని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుంటే, అలాంటిదేమీ లేదని ప్రభుత్వం బుకాయిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video