వారిని కొట్టండి, కేసులు పెట్టం: జగన్పై మండిపడ్డ చంద్రబాబు
హైదరాబాద్: ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిని కొట్టినా కూడా తాము కేసులు పెట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ఏపీ శాసన సభలో ప్రకటించారు. ఇసుక పాలసీ పైన ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ఆరోపణలకు ఘాటుగా స్పందించారు.
అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు పెట్టేందుకు కూడా తాము వెనుకాడేది లేదని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు ఎవరైనా ఇసుక దందా చేస్తే ఇప్పటికైనా మానేయాలన్నారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికార పార్టీ వారు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రన్నింగ్ కామెంట్రీ మాని సలహాలు ఇవ్వాలన్నారు. సబ్జెక్జ్ విని పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు. పూర్తిగా విన్న తర్వాత తప్పులు ఉంటే సలహాలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు అవగాహనే లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రతిపక్షం చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు.
ఇసుక పైన రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచామన్నారు. ఏపీ వ్యాప్తంగా 491 ఇసుక రీచ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిని కొట్టినా కూడా కేసులు పెట్టమని ప్రతిపక్షానికి చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తామన్నారు.
అధికార పార్టీ వారు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించగా, దానిపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఇసుక వ్యాపారంలో 2వేల కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి యనమల రామకృష్ణుడే చెప్పారన్నారు. రెండేళ్ల పాటు అధికార పార్టీ యథేచ్చగా దోచిందన్నారు.