అన్ని కాకి లెక్కలే.. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు: బొత్స
వృద్దిరేటు పెరిగిందని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగిస్తున్నారని బొత్స సత్యానారాయణ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వృద్దిరేటు లెక్కలన్ని వట్టి కాకి లెక్కలేనని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవగా.. దాన్ని 12శాతం అంటూ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని ఇదివరకే ఆయన ఆరోపించారు.
తాజాగా ఇదే అంశంపై బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. వృద్దిరేటు పెరిగిందని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలేనని, తప్పుడు గణాంకాల వల్ల రాష్ట్రం వెనకబడిపోతుందని అన్నారు.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి అసలే మాత్రం దీనిపై అవగాహన లేదన్నారు. అన్ని ఆధారాలతో అసలైన వృద్ధి రేటు వివరాలను తాము బయటపెట్టామని, ఇది తప్పని చెప్పగలరా? అంటూ ప్రభుత్వాన్ని బొత్స నిలదీశారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఏవిధంగా మోసగిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే.. కొత్తవి వచ్చాయని అసత్యాలు ప్రచారం చేయడం సమంజసమా? అని ఈ సందర్బంగా బొత్స ప్రశ్నించారు. వృద్ధి రేటుపై తమవద్ద ఉన్న అన్ని గణాంకాలని ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. తప్పుడు లెక్కలతో సామాన్యుడి జీవితం అతలాకుతలమయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
విశాఖలో ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సు ద్వారా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిందా? అని బొత్స ప్రభుత్వాన్ని నిలదీశారు.