తగ్గుతారా?: జగన్తో భూమా భేటీకి పచ్చజెండా, వైసిపికి చిక్కులే
నంద్యాల బరిలో టిడిపి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటవలే ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది.
నంద్యాల: నంద్యాల బరిలో టిడిపి నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి బరిలోకి దిగనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటవలే ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. అయితే దీనిని ఏకగ్రీవం చేసేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.
వైసిపితో మాట్లాడే బాధ్యతను సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాల్వ శ్రీనివాసులు భుజాలపై వేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో టిడిపి నుంచి పోటీ చేయనున్న భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా జగన్ను కలిసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

జగన్తో మాట్లాడి...
ఇప్పటికే మంత్రి అఖిలప్రియ కుటుంబ సభ్యులు వైసిపి నేతలతో ఏకగ్రీవం కోసం చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అవసరమైతే వైయస్ జగన్తో కలిసి మాట్లాడి ఏకగ్రీవం చేయవచ్చునని భూమా కుటుంబ సభ్యులు చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. గతంలో అఖిల.. విజయమ్మను కలిశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి.. జగన్ను కలవొచ్చని అంటున్నారు.

చంద్రబాబు పచ్చజెండా
భూమా బ్రహ్మానంద రెడ్డి ఏకగ్రీవానికి అవసరమైతే ప్రతిపక్ష పార్టీతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమోదం తెలిపాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్తో భూమా కుటుంబ సభ్యులు చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎంత చర్చలు జరిపినా జగన్ పోటీకే సిద్ధపడతారని అంటున్నారు.

శిల్పా మోహన్ రెడ్డితో జగన్కు తలనొప్పి
శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరడంతో జగన్కు తలనొప్పి ప్రారంభమైందని అంటున్నారు. శిల్పా టిడిపి నుంచి వెళ్లిపోవడంతో భూమా బ్రహ్మానంద రెడ్డికి లైన్ క్లియర్ అయింది. ప్రకటన కూడా వెలువడింది. అఖిలప్రియపై టిడిపి మరో సీనియర్ ఏవీ సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అది చల్లబడింది. టిడిపి నుంచి బ్రహ్మానంద రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వైసిపిలో టిక్కెట్ కోసం పోటీ నెలకొందని అంటున్నారు.

వైసిపి నుంచి ఆశలు పెట్టుకున్న వారు.. కాటసాని షాకివ్వొచ్చు
వైసిపి నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు టిక్కెట్ పైన ఆశ పెట్టుకున్నారు. కానీ శిల్పా చేరికతో అంతా రివర్స్ అయింది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వైసిపి మరో నేత కాటసాని రాంరెడ్డి వైసిపికి సహకరించే పరిస్థితి లేదని అంటున్నారు. బ్రహ్మానంద రెడ్డి.. కాటసానికి స్వయానా అల్లుడు. కాబట్టి పరోక్షంగా ఆయన టిడిపికి సహకరించవచ్చుననే వాదనలు ఉన్నాయి.

గౌరు కూడా అసంతృప్తి
శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరిన నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత గౌరవ వెంకట రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా గౌరు వెంకట రెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. ఆ సమయంలో వీరి వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications