మహిళల ఫ్రీ బస్సుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్-ఆర్టీసీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో కూటమి పార్టీల ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. ఆగస్టు 15న లాంఛనంగా ఈ పథకం అమలు ప్రారంభించబోతున్నట్లు ఇవాళ చంద్రబాబు కర్నూల్లో తెలిపారు. దీంతో కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నట్లు అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ మంత్రులు ఈ ప్రకటనపై స్పందించారు.
ఉచిత బస్సు ప్రయాణ ప్రకటనపై సీఎం చంద్రబాబుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సామాన్య ప్రజల కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చొరవ అభినందనీయం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలకు భారీ ఊరట కలుగుతుందన్నారు. చంద్రబాబు ప్రజా సంకల్పమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని మంత్రి తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ప్రయాణంలో భద్రత, స్వేచ్ఛను కలిగించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

గ్రామాల నుంచి పట్టణాలకు వడివడిగా ప్రయాణించే మహిళలకు ఇది వరమని మంత్రి మండిపల్లి తెలిపారు. ఇది కేవలం ఓ నిర్ణయం కాదని, ప్రజల పట్ల సీఎం హృదయాన్ని చూపిస్తోందన్నారు. ఉచిత బస్సు పథకంతో కుటుంబ ఆర్థిక భారం తగ్గిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం, సౌకర్యాల పాలనకు సంకేతం ఇదే అన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు బలమైన అడుగుగా దీన్ని ఆయన అభివర్ణించారు.
మరోవైపు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తం ప్రకటించడాన్ని స్వాగతించారు. ఇచ్చిన మాట పైన నిలబడే నిజమైన నాయకుడు చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రకటించడం సంతోషకరం అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలన్నిటిని అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

వచ్చే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయబోతున్నామని మంత్రి అనగాని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విషయమై భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమం ముందుకు సాగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications