జైల్లో పెడతానని చంద్రబాబు బెదిరిస్తున్నారు, ఏం చేద్దాం: రోజా
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రంగా మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాడుతుంటే వారిని జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరిస్తున్నారని విమర్శించారు.
అలాగే ఇదే అంశం పైన పోరాడుతున్న విద్యార్థులను కూడా జైలులో పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు చెప్పారని, పదిహేనేళ్లు కావాలి చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
అలాంటి వాళ్లు ఇప్పుడు ప్రత్యేక హోదాను కాదని, దాని కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలని చెప్పడం విడ్డూరమన్నారు. వాళ్లు ప్యాకేజీ గురించి మాట్లాడటం సరికాదన్నారు. అబ్దాలాడిన చంద్రబాబు, వెంకయ్యలను ఏం చేయాలని రోజా ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా గురించి తమ పార్టీ నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు. కాగా, ఆమె ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
వెంకయ్య పైన భూమన ఆగ్రహం
ఏపీకి ఆశాజ్యోతి వంటి హోదాను సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, వెంకయ్యలు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హోదా కోసం డిమాండ్ చేసిన వాళ్లు ఇప్పుడు ప్యాకేజీ వల్ల లాభం అని చెప్పడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.