చంద్రబాబు వెనుక జగన్: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు గురువారం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ఏడోసారి, జగన్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ పులివెందుల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరిద్దరు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కాగా, అసెంబ్లీలో జగన్, చంద్రబాబులు కరచాలనం చేసుకున్నారు.
గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు, జగన్ కరచాలనం చేసుకున్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్ మొదట చంద్రబాబు, తర్వాత జగన్, ఆ తర్వాత మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
చంద్రబాబు, జగన్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులు... కెఈ కృష్ణమూర్తి, చినరాజప్ప(తొలిసారి), అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణ, దేవినేని ఉమామహేశ్వర రావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస రావు, గంటా శ్రీనివాస రావు ప్రమాణ స్వీకారం చేశారు.