సిఎంల భేటీ లేదు: చంద్రబాబుకూ స్వల్ప అస్వస్థత, రాష్ట్రపతిని కలిశారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయన మంగళవారం కేర్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన మంగళవారంనాటి అపాయింట్మెంట్లన్నింటినీ రద్దు చేసుకున్నారు. అయితే ఒక రోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అస్వస్థతకు గురికావడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కాగా, ఇద్దరు ముఖ్యమంత్రులు అస్వస్థతకు గురికావడంతో విందు కార్యక్రమానికి వీరిద్దరూ వెళతారా? లేదా అనేది సందేహంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారం నడస్తున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విందు భేటీలో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే ఏపి సిఎం చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.