తెలంగాణ ఐఏఎస్ కు కీలక బాధ్యత ఇచ్చిన చంద్రబాబు-బడ్జెట్ వేళ నిర్ణయం..!
ఏపీ విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లలేదు. దీంతో వీరిని తాజాగా పదేళ్ల తర్వాత తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ తేల్చిచెప్పేసింది. ఈ ఆదేశాలపై వారు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో వీరంతా వారికి కేటాయించిన రాష్ట్రాలకు మారిపోయారు. ఇలా మారిన వారిలో ఏపీకి వచ్చిన ఐఏఎస్ లకు ఒక్కొక్కరిగా ప్రభుత్వం పోస్టింగ్స్ ఇస్తోంది.
ఇదే క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ ను ప్రభుత్వం కీలకమైన ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఆర్ధిక శాఖలో బడ్జెట్ నిర్వహణ, వ్యవస్థాగత ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలను రోనాల్డ్ రాస్ కు అప్పగించారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారుల్లో అత్యంత కీలక బాధ్యత ఆయనకే ఇచ్చినట్లయింది. డీవోపీటీ ఆదేశాల మేరకు గత నెలలోనే ఏపీకి వచ్చి రిపోర్ట్ చేసిన రోనాల్డ్ రాస్ కు ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది.

మరోవైపు ఇవాళ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసలే రాష్ట్రంలో నిధుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది. మరోవైపు ఆర్ధిక మంత్రిగా తొలిసారి పనిచేస్తున్న పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రోనాల్డ్ రాస్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని కీలకమైన ఆర్ధిక శాఖ కార్యదర్శిగా, అదీ బడ్జెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇప్పటికే కాటా ఆమ్రపాలి, వాణీ మోహన్ వంటి తెలంగాణ నుంచి వచ్చిన అధికారులతో పోల్చినా రోనాల్డ్ రాస్ కు దక్కిన పోస్టింగ్ పై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications