జనసేనతో పొత్తుపై రేపు మహానాడులో చంద్రబాబు ప్రకటన?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో విపక్షాలు కలిసి పోటీ చేయడంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల సారాంశమంతా ఒక్కటే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా పోటీ చేయడం.
రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపాలంటే కచ్చితంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అవసరమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటనలు చేసినా చంద్రబాబు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభమవుతున్న టీడీపీ మహానాడులో చంద్రబాబు దీనిపై కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేత సోమిరెడ్డి సంకేతాలు ఇచ్చారు.

టీడీపీ-జనసేన పొత్తుపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పలుమార్లు చర్చించారని, రేపు ప్రారంభం కాబోతున్న మహానాడులో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంకేతం ఇచ్చారు. అయితే పార్టీ పొలిట్ బ్యూరో తయారు చేసే రాజకీయ తీర్మానంలో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే అది అంతిమంగా వైసీపీకి రాజకీయంగా మేలు చేస్తుందన్న భావనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం.
గతంలో 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన తొలిసారిగా పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ పొత్తుపై ప్రకటన రావడం, ప్రధానిగా ప్రచారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ఏపీకి వచ్చి చంద్రబాబు, పవన్ లతో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొనడంతో ఓ హైప్ ఏర్పడింది. చివరికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఈసారి పరిస్ధితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలకు ఉమ్మడిగా ప్రచారం చేసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ వైఖరిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications