చంద్రబాబు కేబినెట్లో జనసేనకు ఆఫర్ ఇదేనా ? మంత్రి పదవులకు తీవ్రపోటీ..!
ఏపీలో త్వరలో ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకూ ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే టీడీపీ, బీజేపీతో పోలిస్తే జనసేన తరపున ఈసారి మంత్రులుగా ఎవరెవరు ఉండబోతున్నారు, అలాగే ఎన్ని మంత్రి పదవుల్ని జనసేనకు టీడీపీ ఇవ్వబోతోందన్న అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేరికపైనా ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు.
చంద్రబాబు సీఎంగా ఏర్పాటయ్యే కొత్త కూటమి ప్రభుత్వంలో జనసేనకు మొత్తం మూడు మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 25 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి మరో రెండు బెర్తులు కేటాయించి సీఎం సహా 20 మంది టీడీపీ మంత్రులు ఉండేలా కూర్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ్టి నుంచి కసరత్తు మొదలుకాబోతోంది.

ముఖ్యంగా జనసేనకు టీడీపీ ఇస్తుందని భావిస్తున్న మూడు మంత్రి పదవుల్లో ఓ డిప్యూటీ సీఎంతో పాటు మరో రెండు మంత్రి పదవులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మంత్రి పదవులు కూడా కీలక శాఖలు ఉండేలా జనసేనకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. తద్వారా జనసేనలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడాలనేది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేబినెట్లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ చేరితే ఆయనకే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దగ్గబోతున్నాయి. పవన్ చేరకపోయినా డిప్యూటీ సీఎం పదవి జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని చెప్తున్నారు.
ఇక జనసేన నుంచి కేబినెట్ బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అసలే కూటమిలో భాగస్వామిగా మారాక పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకున్న పవన్ సామాజికవర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే కూటమి సునామీలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఇప్పుడు జనసేన తరఫున మంత్రులుగా ఉండే వారిలో కాపు సామాజిక వర్గంతో పాటు ఇతరులకూ చోటు కల్పించక తప్పదు. పవనే డిప్యూటీ సీఎంగా ఉంటే జనసేన మంత్రుల్లో కాపులకు మరో బెర్త్ ఇవ్వకపోవచ్చు. అలాగే సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణకు తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications