జగన్ తెచ్చిన కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్పై చంద్రబాబుది మైండ్ గేమా, ఓటమి భయమా?
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి తెరలేపాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ వివిధ రకాల చర్చలు సాగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా? చంద్రబాబుతో కలుస్తారా? లేక మరెవరుతోనైనా జత కడతారా? అనే చర్చ సాగుతోంది. కానీ జనసేన మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు అని ప్రకటించడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ మాతో కలిస్తే జగన్కు ఏం సమస్య అని, ఆయన తమతో కలిసి బీజేపీయేతర కూటమిలో కలవాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఇది సరికొత్త చర్చకు తెరలేపింది. అయితే ఇది చంద్రబాబు మైండ్ గేమ్ కావొచ్చునని కొందరు అంటున్నారు. విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు వ్యూహాత్మకంగా సమాధానం చెప్పారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ను మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమా?
2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికారు. ఇప్పుడు దూరం జరిగారు. ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ గెలుపు విషయం పక్కన పెడితే టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై బాగా ప్రభావం చూపనున్నారు. పవన్ కారణంగా ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితులు ఉండవచ్చు. పవన్ కారణంగా వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ దెబ్బ. ఈ నేపథ్యంలో పవన్ తమ వైపే ఉంటారనే సంకేతాలు ఇవ్వడం ద్వారా జనసేనానిపై ఆయన మైండ్ గేమ్ ఆడుతుండవచ్చునని అంటున్నారు.
పవన్ ఈ రోజే ప్రచారానికి తెరలేపారు. ఆయన దూసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకా అనే చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ను దూరం చేసుకునే ఆలోచన లేదా?
మరో చర్చ కూడా సాగుతోంది. అసలు పవన్ కళ్యాణ్ను దూరం చేసుకునే ఉద్దేశ్యం టీడీపీకి లేకపోవచ్చునని అంటున్నారు. ఆయనను తిరిగి మచ్చిక చేసుకునే ఉద్దేశ్యం చంద్రబాబుకు ఉండి ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే నిన్నటి వరకు విమర్శలు గుప్పించిన చంద్రబాబు హఠాత్తుగా ఇలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చుననేది తెలిసిందే.

సంప్రదింపులు జరుగుతున్నాయా?
చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తెరవెనుక ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీయేతర పార్టీలతో తాము ఉన్నామని, తమతో కలిసి రావాలని చంద్రబాబు జనసేనానికి సూచించారు.

పవన్ విషయంలో మార్పు ఎందుకు, ఓటమి భయమా?
నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు టీడీపీ అధినేతలో మార్పు వచ్చింది. దీనికి ఓటమి భయమే కారణమని విపక్షాలు అంటున్నారు. జనసేన, వైసీపీలు తమ ప్రత్యర్థులుగా ఉంటే ఓడిపోతామనే భయంతోనే పవన్ తమ వాడుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నారు. జనసేన దూరమైతే తమ ఓటు తగ్గి జగన్ అధికారంలోకి వస్తారనే ఆందోళన టీడీపీలో ఉండి ఉండవచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కన్ఫ్యూజన్ జగన్ నుంచి ప్రారంభమైంది. పవన్, చంద్రబాబు ఒక్కటేనని వైసీపీ అధినేత పదేపదే చెబుతున్నారు. దానిపై మీడియా ప్రశ్నకు చంద్రబాబు పైవిధంగా స్పందించారు. దీంతో మరింత కన్ఫ్యూజన్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications