ఇదే మనకు నేర్పారు: ఎన్డీటివికి బాబు, కలాంకు భారతరత్న కోసం ఏపీ సీఎం
హైదరాబాద్: అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీటీవీతో తన అనుభవాలను పేర్కొన్నారు. కలాం ఓ మానవతావాది, ఆశావాది అని పేర్కొన్నారు. తాను ఎప్పుడు అతనిని కలాంగారు అని పిలిచేవాడినని చెప్పారు.
కలాం తనకు ఎప్పుడూ స్ఫూర్తి అన్నారు. అతని ప్రసంగాలకు ఉత్తేజితులైన కోట్లాదిమందిలో తాను ఒకడినన్నారు. గత ఏడాది కలాం గారు అనంతపురం వచ్చినప్పుడు రైతులను ఉద్దేశించి.. రైతు స్నేహితులారా అని పలకరించారని, తెలుగులో మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.
దేశం అభివృద్ధిలో వారి పాత్ర అమోఘమని కొనియాడారన్నారు. కలాం గారు రామేశ్వరం నుంచి రైసినా హిల్స్ చేరుకున్నారని, కష్టపడి, పట్టుదలతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని కలాం నుంచి నేర్చుకోవచ్చన్నారు.
తాను సమైక్య ఏపీలో విజన్ 2020 అంశంపై తాను మొదటిసారి కలాంగారిని కలిశానని చెప్పారు. అలిపిరి ఘటన అనంతరం అక్టోబర్ 3, 2003న జూబ్లిహీల్స్ లోని తన ఇంటికి వచ్చి పరామర్శించారన్నారు. తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కలాం గారిని రాష్ట్రపతిని చేయడంలో తన పాత్ర ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. చిన్నారుల పట్ల ఆయన ప్రేమ, వారిని ఉత్తేజపరిచే తీరు అద్భుతమన్నారు. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని కలాం తనతో ఓ సందర్భంలో చెప్పారని గుర్తు చేసుకున్నారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పెద్ద కలను కనాలని అబ్దుల్ కలాం మనకు నేర్పారన్నారు. కలాం మన హృదయాల్లో నిలిచిపోతారన్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కలాం రాష్ట్రపతి కావడంలో తన పాత్ర ఉందని అందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఆయనను భారతరత్నకు కూడా రికమెండ్ చేసినట్లు చెప్పారు.