అమరావతికి చంద్రబాబు ప్రణామం - మోడీ శంఖుస్థాపన చేసిన చోట ఇంద్ర సీన్..!
ఏపీ రాజధాని అమరావతికి పునర్వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడి నిర్మాణాల తాజా పరిస్ధితిని తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ గతంలో అమరావతికి శంఖుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ సాష్టాంగ ప్రణామం చేశారు. తద్వారా రాజధానికి తన ప్రాధాన్యమేంటో ఆయన మరోసారి గుర్తుచేశారు.
గత వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఇందులో భాగంగా తాజా పరిస్ధితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం సమీక్ష నిర్వహించి ఈ నెల 24న జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉండవల్లి కరకట్టపై తన నివాసం పక్కనే గత సీఎం జగన్ కూల్చేసిన ప్రజావేదిక నుంచి బయలుదేరి అమరావతిలో పర్యటిస్తున్నారు.

ఉదయం ప్రజా వేదిక నుంచి బయలుదేరిన చంద్రబాబు.. ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నేలకు మొక్కిన చంద్రబాబు.. అనంతరం అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లోనూ సీఎం చంద్రబాబు పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications