ముగ్గురు మంత్రులకు షాకివ్వనున్న బాబు: లోకేష్పై సస్పెన్స్, వైసిపి నుంచి ఇద్దరికి!
అమరావతి: మున్సిపల్ ఎన్నికలలోపే రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఐదుగురికి మంత్రివర్గంలో అవకాశం దక్కనుందని తెలుస్తోంది. వైసిపి నుంచి వచ్చిన వారికి ఇద్దరికి చోటు కల్పించనున్నారు.
కొన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగేలోపే, అంటే మరికొద్ది రోజుల్లోనే విస్తరణ అవకాశాలుకనిపిస్తున్నాయని అంటున్నారు. వైసిపి నుంచి వచ్చిన వారికి ఇద్దరికి, ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది.
మొత్తంమీద అయిదుగురు అంతకంటే ఎక్కువగా మంత్రివర్గంలో చేరవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, తొలిగించాల్సి వస్తే ఎవరికి ఇతర బాధ్యతలు అప్పగించాలి, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి మార్పులుండాలి, పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సిన జిల్లాల్లో కొత్తగా ఎవరిని చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది, సామాజిక సమతూకం పాటించటం తదితర అంశాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వడంపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండున్నర సంవత్సరాలు అతోంది. అప్పటి నుంచి మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల్లేవు.
మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారికి ఆయా శాఖల పనితీరు, వారి సొంత జిల్లాలు, ఇంచార్జులుగా ఉన్న జిల్లాలపై పట్టు సాధించటానికి కొంత సమయం పడుతుందని భావించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా కొందరి పనితీరు పట్ల చంద్రబాబు సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది.
అదే సమయంలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్ల అనంతరం మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థలు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి వంటివీ ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరగబోతున్న తొలి ఎన్నికలు కావటం, తొమ్మిది జిల్లాల పరిధిలో ఉండటంతో ఈ ప్రక్రియ ముగిశాకే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని తొలుత చంద్రబాబు భావించారు.
జనవరిలోగాని పురపాలక ఎన్నికలు జరిగేలా లేవు. దీంతో ఈలోగానే మంత్రివర్గాన్ని మార్పులు, చేర్పులు చేయాలని తాజాగా నిర్ణయించారని తెలుస్తోంది. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవటంలో ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది వస్తే తప్ప వీరి చేరిక దాదాపు ఖాయమేనని భావిస్తున్నారు.
వైసిపి నుంచి చేరిన ఇరవై మంది శాసనసభ్యుల్లో కనీసం అయిదారుగురు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నా ఇద్దరు, ముగ్గురికే అవకాశం దక్కొచ్చు.
ఆయా జిల్లాల రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, సామాజిక సమతూకం ఎలాగుంటుందన్న అంశాలు... వీరి ఎంపికను నిర్దేశించనున్నాయి. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్ల పేరు ప్రముఖంగా కనిపిస్తోంది. నారా లోకేష్ను కేబినెట్లోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.