ఒక్క ఓటు రాలేదు: బీజేపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, 98 శాతం మంది సంతృప్తి
Recommended Video
అమరావతి: బీజేపీతో పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా వచ్చిన లాభం ఏమీ లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రులు, అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2014 సాధారణ ఎన్నికల కన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో వచ్చిన ఓట్లే, పొత్తు తర్వాత కూడా వచ్చాయని చెప్పారు.
బీజేపీ వల్ల అదనంగా ఓట్లు రాలేదు
బీజేపీ వల్ల అదనంగా ఎటువంటి ఓట్లు రాలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పొత్తు లేకుండా ఎన్ని ఓట్లు వచ్చాయో, పొత్తుతోనూ అన్నే ఓట్లు వచ్చాయని, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఇప్పటి వరకు కొనసాగిస్తూ వేచి చూశామన్నారు.
నిధులు ఇస్తామని చెప్పి
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు తెలిపారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు దానిని నిలబెట్టుకోలేదన్నారు.
అడిగిన ప్రతిసారి పంపిస్తున్నాం
యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామాలతో 98 శాతం మంది సంతృప్తి
కేంద్ర మంత్రుల రాజీనామాల తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారని చంద్రబాబు వారిని ప్రశ్నించారు. 98 శాతం మంది అభినందిస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్పారు. బీజేపీతో పొత్తు తెంచుకోవడమే మంచిది అయిందని బాబు చెప్పారని తెలుస్తోంది.