అదే వ్యూహం: కేసీఆర్ మార్కు రాజకీయమే చంద్రబాబుదీ, తెలంగాణలో జరిగిందే ఆంధ్రలో కూడా...
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అవుతున్నట్లు సమాచారం.
మరావతి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల విషయంలో వచ్చే విమర్శలను ఎదుర్కొనే వ్యూహం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో అవుతున్నట్లు సమాచారం.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా కట్టబెడతారు? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలో మంత్రులుగా చేరిన సమయంలో చంద్రబాబు ఇదే మాదిరిగా ప్రశ్నించలేదా? ఇలాంటి ప్రశ్నలు ప్రతిపక్షం నుంచి ఎదురవుతాయని ముందే తెలిసిన చంద్రబాబు వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాన్ని రచించినట్లు సమాచారం.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ కు మంత్రి పదవిని ఇచ్చిన కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయన చేత రాజీనామా లేఖను ఇప్పించారు. తెలుగుదేశం తరుపున గెలిచి మంత్రిగా ఎలా ఉంటారు? అనే ప్రశ్న, విమర్శలు రావచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ ముందుగానే తలసాని చేత స్పీకర్ కు రాజీనావా లేఖను ఇప్పించారు.
అయితే ఈ రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించలేదు. అది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. ఏళ్లు గడిచిపోతున్నా అదే పరిస్థితి. అందులో మార్పు ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఆందోళన వ్యక్తం చేసినా తెలంగాణలో అది అరణ్యరోదనే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ఇదే రీపీట్ అవబోతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు.. వారితో తన వ్యూహం ప్రకారం రాజీనామాలు చేయిస్తారని, ఆ లేఖలను స్పీకర్ కు పంపబోతున్నారని, ఆ తరువాత స్పీకర్ వాటిని ఆమోదించకుండా అలా పెండింగ్ లో ఉంచుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ పార్టీ ఫిరాయింపుదారులకు ఎలా మంత్రి పదవులు కట్టబెట్టారంటూ ప్రతిపక్షం దాడి చేస్తే.. వారు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు కాబట్టి, వారికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఎదురుదాడి చేయవచ్చనేది చంద్రబాబు వ్యూహమని చెబుతున్నారు. వాటిని స్పీకర్ ఎలాగూ ఆమోదించరు కాబట్టి, ఉప ఎన్నికలు వస్తాయేమో అన్న భయం కూడా ఉండదు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహం ఇదేనని, ఇప్పుడు అపర చాణక్యుడు చంద్రబాబు కూడా కేసీఆర్ మార్కు రాజకీయ చతురతనే ప్రదర్శించబోతున్నారని, మొత్తానికి ఇద్దరు చంద్రులదీ ఒకే తీరు రాజకీయమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.