అంతర్జాతీయ నేరస్తులతో చంద్రబాబుకు సంబంధాలు : సజ్జల సంచలన ఆరోపణలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు అంతర్జాతీయ నేరస్తులతో సంబంధాలు ఉన్నాయన్నారు. రాష్ట్రం కోసం అని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి చివరకు బినామీలకు మళ్లించారని ఆరోపించారు. ఆ డబ్బంతా ఎక్కడికి తరలిపోయిందో.. ఎక్కడి నుంచి విదేశాలకు పంపించారోనని వ్యాఖ్యానించారు. ఒక్క చంద్రబాబు పీఏ వద్దే రూ.2వేల కోట్ల అక్రమాలు బయటపెడితే.. చంద్రబాబు చేసిన అక్రమాలు ఇంకెన్ని ఉన్నాయోనని అన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి.. లక్షల కోట్లు దోచుకున్నారు..
2014-2019 టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు సజ్జల. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. చివరకు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందంటే.. బినామీల ద్వారా ఆయన మనుషులకే చేరిందన్నారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం చేయిస్తున్న ఐటీ దాడుల్లో అక్రమాలు బయటపడుతుండటంతో.. చంద్రబాబు కిక్కురుమనట్లేదని మండిపడ్డారు. ఆయన్ను సమర్థించే మీడియాకు ఐటీ దాడుల సంగతి అసలు కనపడట్లేదన్నారు.

మాది తెరిచిన పుస్తకం.. : సజ్జల
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడు కాబట్టి చంద్రబాబు అక్రమాలు ఇన్నేళ్లు బయటపడలేదని సజ్జల అన్నారు. మాట్లాడితే తాను నిజాయితీవంతుడినని,దమ్ముంటే అవినీతిని నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేస్తుంటారని.. ఇప్పుడు అవన్నీ బయటపడే సందర్భం వచ్చిందని అన్నారు. ఐటీ దాడులు తాము చేయించట్లేదని,కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాడులు జరిగాయని అన్నారు.
ఓవైపు ఐటీ అధికారులు వారి అక్రమాలన్నీ బయటపెడుతుంటే.. తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు గత పదేళ్లుగా ప్రజలకు తెలుసునని,ప్రజలు ఆ ఆరోపణలను తిరస్కరించారని అన్నారు. తమది తెరిచిన పుస్తకం అని.. నిజానిజాలు కోర్టులో తేలుతాయని అన్నారు.

పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు..
ఇప్పుడు బయటపడింది చిన్న తీగనే అని.. వెనకాల డొంక పెద్దదే ఉండవచ్చునని సజ్జల అన్నారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడు రంగంలోకి దిగే పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. అంతకుముందు సజ్జల చేసిన ట్వీట్లో.. 'పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయి.. మరి చంద్రబాబును పట్టుకుంటే.. ఎన్ని వేల కోట్లో..! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి' అంటూ ట్వీట్ చేశారు.

ఐటీ దాడుల వివరాలు..
ఏపీ, తెలంగాణల్లోని దాదాపు 40 ప్రాంతాల్లో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఐటీ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఐటీ శాఖ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో రూ.2వేల కోట్ల అక్రమాలు బయటపడినట్టు వెల్లడించింది. ముఖ్యంగా మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని, అలాగే, లెక్కచూపని 85లక్షల నగదును, 71లక్షల విలువైన ఆభరణాలను తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఐటీ దాడుల్లో భాగంగా.. టీడీపీ అధినేత,చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ ఇంట్లోనూ తనిఖీలు చేసినట్టు తెలిపింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్టు అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications