మండలి చైర్మన్ షరిఫ్ను చంద్రబాబు ప్రభావితం చేశారు, పెద్దల సభ అభిప్రాయం మాత్రమే చెప్పాలి: మంత్రి
అధికార వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై మండలి అభిప్రాయం కోరితే సెలక్ట్ కమిటీ పంపించాలని ప్రకటించడం సరికాదన్నారు. పెద్దల సభ అభిప్రాయం తీసుకోవడమే తప్ప.. చట్టాలు చేయడం కాదన్నారు. సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరితే ముందు అసెంబ్లీలో తీర్మానం చేయాలని.. ఏ నియమాన్ని కూడా పెద్దల సభలో పాటించలేదని విమర్శిచారు.

ప్రత్యేక పరిస్థితుల్లో..
300 పేజీల పుస్తకం చదివి లొసుగులను బయటకు తీసుకొచ్చారని బుగ్గన పేర్కొన్నారు. రూల్ 71 ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారని చెప్పారు. కానీ మండలి చైర్మన్ షరీఫ్ ఎందుకు వాడారో అర్థం కావడం లేదన్నారు. రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడం ఆశ్చర్యంగా ఉందని.. సెలక్ట్ కమిటీకి పంపించే విచక్షణాధికారం చైర్మన్ షరీఫ్కు లేదన్నారు.

రూల్ 71 ఎందుకు..?
వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనను పక్కనపెట్టి.. మండలి చైర్మన్ రూల్ 71 ఉపయోగించారని పేర్కొన్నారు. కొత్తగా సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షం లేఖ ఇచ్చిందని చెబుతున్నారు. లేఖ కాదు సభలో తీర్మానం చేయాలనే విషయాన్ని మరిచారా అని అడిగారు. మండలి అంటే సలహా ఇవ్వడానికే తప్ప శాసనసభ చేసిన చట్టాలను అడ్డగించేందుకు కాదన్నారు.

నిపుణులు
పెద్దల సభకు అందుకోసమే శాస్త్రవేత్తలు, మేధావులు, ఆర్టిస్ట్, నటులను పంపిస్తారని బుగ్గన గుర్తుచేశారు. శాసనసభకు సలహాలు ఇవ్వాలే తప్ప.. ఇది పద్ధతి కాదన్నారు. మండలి చైర్మన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని పేర్కొన్నారు. మండలి జరుగుతుంటే 4 గంటలపాటు కూర్చొన్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీరు కూడా సరిగా లేదన్నారు. మంత్రులు తాగొచ్చారని మాట్లాడటం సరికాదన్నారు.

రూ.60 కోట్ల వ్యయం
మండలికి రోజుకు రూ.15 లక్షలు ఖర్చు చేస్తే అసెంబ్లీ చేసిన చట్టాలను అడ్డుకుంటారా అని అడిగారు. ఏడాదికి రూ.60 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తే మండలి చైర్మన్ షరిఫ్ చేసింది సరికాదన్నారు.












Click it and Unblock the Notifications