చంద్రబాబును బరోడా మహారాజ్ లా...దళితులు ఆరాధిస్తున్నారు:మంత్రి జవహర్
అమరావతి: సీఎం చంద్రబాబును దళితులు బరోడా మహారాజ్ లా ఆరాధిస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ అభినందించారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ యువతకు విదేశీ విద్య అభ్యసించే అవకాశాన్ని చంద్రబాబునాయుడు కల్పించారని, అందుకే, చంద్రబాబును బరోడ్ మహారాజ్ లా ఎస్సీలు ఆరాధిస్తున్నారని ప్రశంసించారు.
సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ జనవరి 26 నుంచి ఎపి ప్రభుత్వం "దళిత తేజం" కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నేతలు ప్రతి దళితుని ఇంటికి వెళ్లి దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటికి గురించి వారికి తెలియజేస్తారని మంత్రి జవహర్ చెప్పారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబును బరోడా మహరాజ్ తో మంత్రి జవహర్ పోల్చారు.

ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించిన బరోడా మహారాజ్ ను దేశ ప్రజలంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని మంత్రి జవహర్ అన్నారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ఎస్సీ యువతకు విదేశీ విద్య అభ్యసించే అవకాశాన్ని చంద్రబాబునాయుడు కల్పించారని, అందుకే, చంద్రబాబును బరోడ్ మహారాజ్ లా ఎస్సీలు ఆరాధిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్మృతి వనం పేరిట ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో కూడా మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన విషయాన్ని మంత్రి జవహర్ గుర్తు చేశారు. అలాగే మహిళలకు రాజకీయాల్లో 33 శాతం మేరకు రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు కల్పించారని, పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయడంలోనూ, ఆయనకు 'భారతరత్న' ఇవ్వడంలోనూ టీడీపీ పాత్ర మరువలేనిదని కొనియాడారు.












Click it and Unblock the Notifications