జగన్కు రాజ్యసభ షాకిచ్చేనా: జంపింగ్ ఎమ్మెల్యేలకు బాబు 'సెల్ఫోన్' షాక్
విజయవాడ/హైదరాబాద్: నాలుగో స్థానం నుంచి పోటీ చేసే విషయమై తెలుగుదేశం పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజుతో (మంగళవారం) రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోంది. టిడిపి నుంచి ఇద్దరు, టిడిపి మద్దతుతో నామినేషన్ వేసే బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు.
సభలో బలాన్ని చూస్తే నాలుగో స్థానం వైసిపి గెలుచుకుంటుంది. అయితే, వైసిపి నుంచి తమ వైపు చేరిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉంటూ తమకు మద్దతిచ్చే వారు ఉన్నారనే అభిప్రాయంతో చంద్రబాబు నాలుగో సీటు పైన తర్జన భర్జన పడుతున్నారు.
కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్లను చంద్రబాబు ఖరారు చేశారు. వారు మంగళవారం ఉదయం టిడిపి కార్యాలయం నుంచి బయలుదేరారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పదకొండు గంటల ప్రాంతంలో నామినేషన్ వేయనున్నారు.
వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు షాక్!
నాలుగో అభ్యర్థి పైన చర్చించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సోమవారం నాడు చంద్రబాబు విజయవాడకు పిలిపించిన విషయం తెలిసిందే. వారితో నాలుగో స్థానంలో పోటీపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ తరఫున కాకుండా స్వతంత్రంగా పోటీ చేయించాలని టిడిపి భావిస్తోంది.
అప్పుడు తమ పార్టీలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలతో పాటు, ఆ పార్టీలో ఉండి తమ వైపు మొగ్గే ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారని టిడిపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, సోమవారం నాడు విజయవాడ వచ్చిన వైసిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కార్యాలయం వద్ద షాక్ తగిలిందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపుతో వైసిపి నుంచి టిడిపిలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి వచ్చారు.
ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీకి లోపలికి వెళ్లేందుకు సిద్ధపడ్డ ఎమ్మెల్యేలకు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది షాకిచ్చారు. సెల్ఫోన్లను లోపలికి అనుమతించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. చేసేదేం లేక సెల్ఫోన్లను సెక్యూరిటీ వద్దే ఉంచేసిన వారంతా చంద్రబాబుతో భేటీకి లోపలికి వెళ్లిపోయారు.