పహల్గాం-అమరావతి! మోడీతో చంద్రబాబు భేటీ, సీమలో కీలక ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు.
పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి దేశాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. ఇటువంటి పిరికిపంద హింసను ఎంత ఖండించినా సరిపోదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తారు. భారతదేశ భద్రతను కాపాడటంలో ప్రధాని మోడీ నిర్ణయాత్మక నాయకత్వానికి మేము పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

మరోవైపు, మే 2న అమరావతి పునర్ ప్రారంభ పనులకు ప్రధాని మోడీని చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు రూ. లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసింది. వెలగపూడి సచివాలయం వెనుక అమరావతి పునర్ ప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ. లక్ష కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోడీ.. పైలాన్ను ఆవిష్కరించనున్నారు.
ప్రధాని మోడీతో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. రాయలసీమ అభివృద్ధిపై కూడా చర్చించినట్లు సమాచారం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకారం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోడీతో చంద్రబాబు చర్చించారు. వీరి భేటీ దాదాపు గంటన్నరపాటు జరిగింది.
ప్రధానమంత్రి మన రాజధాని నగరం కోసం తన దార్శనిక సూచనలను కూడా పంచుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడానికి మేము వాటిని అమలు చేస్తాము. సమావేశంలో, ఆంధ్రప్రదేశ్లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా నేను ఆయనకు వివరించాను. కేంద్ర ప్రభుత్వం నిరంతర మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను అని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications