పెనుమార్పులకు సంకేతం: ములాయం, 'చంద్రబాబు దెబ్బకు ఆందోళనలో మోడీ'
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీలో పలువురు నేతలను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలవడం కీలక పరిణామం. రాహుల్తో భేటీకి ముందు, ఆ తర్వాత పలువురు నేతలను కలిశారు. శరద్పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సీతారాం ఏచూరీ తదితర నేతలను కలిశారు.

టీడీపీ, ఎస్పీల కలయిక పెనుమార్పులకు సంకేతం
ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, టీడీపీ, ఎస్పీల కలయిక పెనుమార్పులకు సంకేతమని ములాయం అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు చూపిన చొరవ మెచ్చుకోదగినదని, రాజ్యాంగాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు.

ఇది శుభపరిణామం
రాహుల్ గాంధీ, చంద్రబాబులు చేతులు కలపడం శుభపరిణామం అని, నరేంద్ర మోడీ దుష్టపాలనలో దేశం ప్రమాదంలో పడిందని, దానిని రక్షించేందుకు దేశంలోని మిగతా రాజకీయా పార్టీలు, నాయకులు తమ రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలపాలని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి అన్నారు.

చంద్రబాబు పిలుపులో వాస్తవం
నరేంద్ర మోడీ కారణంగా దేశం ఎంత ప్రమాదంలో పడిందనే విషయం తెలిసి చంద్రబాబు, రాహుల్ గాంధీలు చేతులు కలిపారని, అందరూ అదే పంథా కొనసాగించాలని అరుణ్ శౌరి సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలన్న చంద్రబాబు పిలుపులో వాస్తవం ఉందని, గత కొంతకాలంగా తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నానని చెప్పారు. మంచి పాలనాదక్షత, విభిన్న నాయకులతో చంద్రబాబుకు పరిచయం ఉందని, అలాంటి వ్యక్తి కీలక భూమిక పోషిస్తే బాగుంటుందన్నారు.

చంద్రబాబు దెబ్బకు ఆందోళనలో మోడీ
ప్రస్తుతం చంద్రబాబుతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపడం ప్రధాని మోడీ ఆందోళనకు గురవుతుంటారని అరుణ్ శౌరీ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని చెప్పారు. మోడీ దుష్పరిపాలన వల్ల దేశంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయో తెలుసుకొనే వారు శత్రుత్వాన్ని పక్కన పెట్టి చేతులు కలిపారని చెప్పారు. పాత శత్రుత్వాలను పక్కన పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications