పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్కు కేంద్రానిదే బాధ్యత'
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయమై మరోసారి కదలిక వచ్చింది.కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుదవారం నాడు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయమై బాబు నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయమై ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు సాగుతున్న తరుణంలో బాబు కేంద్ర మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
పోలవరం ప్రాజెక్టు విషయమై విపక్షాలు ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపిపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే విపక్షాల ఆరోపణలపై టిడిపి కూడ తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల చోటు చేసుకొన్న ఘటనలతో పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి దండం పెట్టి నిర్మాణ పనులను కేంద్రానికే అప్పగిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

నితిన్ గడ్కరీతో కీలక సమావేశం
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. డిసెంబర్ 13వ, తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం కానున్నారు.పోలవర్ ప్రాజెక్టు విషయమై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో సంచలనం రేగింది.నితిన్ గడ్కరీ సమావేశంలో పోలవరంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఏపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబుకు గడ్కరీ ఫోన్
డిసెంబర్ 12వ, తేది సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయమై పోన్లో చంద్రబాబుతో గడ్కరీ చర్చించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం పలు మార్లు హమీ ఇచ్చింది. ప్రతి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

త్రిసభ్య కమిటీతో బాబు సమావేశం
పోలవరం ప్రాజెక్టుపై త్రిసభ్య కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించాల్సిన అంశాలపై బాబు ఆరా తీశారు. మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ అయింది.

సీఎంల సమావేశం కేంద్రం బాధ్యతే
పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను సీఎం పేషీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎంలు మాట్లాడుకోవాలని ఒడిశా కోరుతోందని లేఖ సారాంశాన్ని వివరించారు.జాతీయ ప్రాజెక్టు కావడంతో ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధానిదేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications