ఇక మొహమాటం లేదు, ఆస్తులు ప్రకటించొద్దని చెప్పారు: చంద్రబాబు
అమరావతి: వచ్చే ఎన్నికల్లో గెలిచిన వారికే టిక్కెట్లు ఇస్తామని, ఇందులో ఎలాంటి మొహమాటం లేదని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఆయన మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో పైవ్యాఖ్యలు చేశారు.
Recommended Video

ఎన్నికల్లో టిక్కెట్లు, నామినెడ్ పదవుల కేటాయింపులో ఇకపై మొహమాటాలకు పోయే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చజి చెప్పారు. తనకు సన్నిహితులు అయితే పిలిచి భోజనం పెడతానని, అంతే తప్ప టిక్కెట్లు, పదవుల వద్ద ఆ సాన్నిహిత్యాన్ని చూపదలుచుకోలేదని తేల్చి చెప్పారు.

పని చేసే వారికే పదవులు
పని చేసే వారికే పదవులు ఇస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో టిక్కెట్లు అయినా, నామినేటెడ్ పోస్టులు అయినా గెలిచే వారికి, బలం ఉన్న వారిక ఇస్తామని చెప్పారు. రాజకీయ అంశాల్లో ఒక్క శాతం కూడా మొహమాటం లేదని చెప్పారు. నామినేటెడ్ పదవులు, ఇతర పదవులు తీసుకొని ఇంట్లో కూర్చుంటే ఊరుకోనని తేల్చి చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పని చేయాలన్నారు.

ఎమ్మెల్యేలపై విమర్శలు తగ్గాయి
ఇంటింటికి టీడీపీ కార్యక్రమం మంచి ఫలితాలు ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. గతంలో తన వద్దకు వచ్చే వారు సీఎం కష్టపడుతున్నంతగా ఎమ్మెల్యేలు తిరగడం లేదని చెప్పేవారని, ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యేలపై విమర్శలు తగ్గాయని చెప్పారు. ఈ కార్యక్రమంతో పార్టీకి లాభం జరిగిందని చెప్పారు. నియోజకవర్గాల్లో పునరేకీకరణ జరిగితే మరింత లాభపడతామని చెప్పారు.

ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలి
ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచడం ద్వారా వారిలో సంతృప్తస్థాయిని మెరుగుపరచాలని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 54 శాతం ఉన్న సంతృప్తిని వచ్చే నెలకల్లా ఐదు శాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. నిరుద్యోగ భృతి, అగ్రిగోల్డ్, ఫాతిమా కాలేజీ వంటి సమస్యలను ఒక దాని తర్వాత మరొకటి పరిష్కరించాలని మంత్రులకు సూచించారు.

కడప స్టీల్ ప్లాంటు పైన
కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్రం ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని కడప జిల్లా అధ్యక్షులు ప్రస్తావించారు. ఆ జిల్లాలో ఇనుప ఖనిజం లేదని, ఖనిజ రవాణా మార్గంలోనూ కడప లేదని, వైయస్ ఊరికే భూమి కేటాయించి ఊరుకున్నారని, మనం ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం ఇనుప ఖనిజం లభ్యత గురించి ప్రశ్నిస్తోందని, మనకు అవకాశం వచ్చినప్పుడు కొంత భారం మనం భరిస్తూ కడపకు విమానాలు నడుపుతున్నామని, అలాగే దీనిపైనా మార్గాలు అన్వేషిద్దామని, దుగరాజపట్నంలో పోర్టుకు సంబంధించి కేంద్రం హామీ కూడా ఇలాగే పీటముడి పడిందని, వీటిపై ఒత్తిడి కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

ధైర్యం ఉంది కాబట్టే ఆస్తుల ప్రకటన
తమలా ఆస్తులను ఎవరు ప్రకటిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నామని చెప్పారు. చాలామంది ఎథిక్స్ కమిటీకి సీల్డ్ కవర్లో పెట్టి ఇచ్చి ఊరుకుంటున్నారని, తాము మాత్రం కుటుంబ ఆస్తులు ఏడేళ్ల నుంచి ప్రకటిస్తున్నామని, లోకేశ్ ఇప్పుడు ప్రజా ప్రతినిధి అయ్యాడని, కాకముందు కూడా తన ఆస్తుల వివరాలు ఇస్తూనే ఉన్నాడని చెప్పారు. కుటుంబ ఆస్తులు ప్రకటించవద్దని నాకు చాలామంది సలహా ఇచ్చారని, ధైర్యం ఉంది కాబట్టి చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications