ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి, మోడీకి ఫోన్ చేశా: ఢిల్లీలో బాబు అమీతుమీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే నాడు అంగీకరించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం రెండేళ్లు ఎదురు చూశానని చెప్పారు. కేంద్రం తీరుతో ఏపీ ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం శుద్ధ అబద్దం అన్నారు.
Recommended Video
ఏపీని కేంద్రం నిండా ముంచిందని మండిపడ్డారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలన్నారు. విభజన హామీలపై, ఏపీకి న్యాయంపై నాలుగేళ్లు ఎదురు చూశామన్నారు. కేంద్రం తీరుతో 5కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. విభజన కారణంగా అడుగడుగునా ఇబ్బందులు వచ్చాయన్నారు.
మీరే లేఖ ఇచ్చారుగా: బాబుకు జైరాం దిమ్మతిరిగే షాక్, కంగుతిన్న సీఎం!
ఢిల్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో అంశాన్ని వివరించారు. 2014లో మోడీ హామీల వీడియోను ప్రదర్శించారు. 1. ప్రత్యేక హోదా 2. పోలవరం ప్రాజెక్టు 3. ఆర్థిక లోటు 4.నవ్యాంధ్ర రాజధాని అమరావతి 5. వెనుకబడిన జిల్లాలకు నిధులు 6. విశాఖకు రైల్వే జోన్ 7. విద్యాసంస్థలు 8. దుగరాజుపట్నం విమానాశ్రయం 9. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ 10. కడప స్టీల్ ప్లాంట్ 11. పన్ను రాయితీలు 12. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్ 13. మెట్రో రైల్ ప్రాజెక్టు 14. అమరావతి - హైదరాబాద్ కనెక్టివిటీ 15. విమానాశ్రయాల విస్తృతి 16. అసెంబ్లీ సీట్ల పెంపు 17. గ్రేహౌండ్ ట్రెయినింగ్ సెంటర్ 18. షెడ్యూల్ 9, 10 అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మీడియాకు ఇందుకు సంబంధించి వివరాలతో కూడిన డాక్యుమెంట్ అందించారు.
ఏపీకి సాయం చేయకుండా ఎదురుదాడి
కేంద్రం ఏపీకి కనీస సాయం చేయకుండా ఎదురుదాడి చేస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని మండిపడ్డారు. విభజన బిల్లును ఆమోదించే సమయంలో ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. అశాస్త్రీయంగా విభజించారన్నారు. ఎఫ్ఆర్బీఎంను పెంచడం లేదన్నారు. ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదన్నారు.
ఏపీకి సాయం చేయకుండా మాపై నిందలా?
ఏపీకి న్యాయం కోసం తాను చివరి వరకు ప్రయత్నాలు చేశానని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల లేఖ కూడా రాశానన్నారు. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటున్నారని మండిపడ్డారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని విభజన సమయంలోనే దీక్ష చేశానని చెప్పారు. కేంద్రం ఏపీకి కనీసం సాయం చేయకుండా మాపై నిందలు వేయడమా అని ధ్వజమెత్తారు.
మోడీకి ఫోన్ చేసి చెప్పేశా, ఎన్డీయేలో నుంచి వైదొలిగా
నాలుగేళ్ల పాటు ఎదురు చూశామని, అయినా న్యాయం చేయకపోవడంతో ప్రధాని మోడీకి ఫోన్ చేసి ఇప్పటికీ ఎన్డీయేలోనే ఉన్నామని, న్యాయం చేయాలని కోరానని, అప్పటికీ న్యాయం జరగకపోవడంతో, కేంద్రం తీరు మారకపోవడంతో ఇక ఎన్డీయేలో కొనసాగడం సరికాదని వైదొలిగామని చంద్రబాబు చెప్పారు.
హోదా లేదంటూనే కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేవంటూనే కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో తాను 29సార్లు ఢిల్లీకి వచ్చానని చెప్పారు. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేతపత్రాలు విడుదల చేశానని తెలిపారు. విభజన వల్ల ఏపీకి చాలా అన్యాయం జరిగిందన్నారు. విభజన హామీలు అమలు చేస్తామంటేనే బీజేపీకి ఓట్లు వేశారని చెప్పారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో లేఖ కూడా రాశానని చెప్పారు.
చిన్న చిన్న విషయాలు తప్ప ఏమీ చేయలేదు
పార్లమెంటులో చేసిన చట్టాలే అమలు కావడం లేదని చంద్రబాబు అన్నారు. చిన్న చిన్న విషయాలు తప్ప రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. పార్లమెంటులో తమ ఎంపీలు చేసిన పోరాటంపై కేంద్రం స్పందించడం లేదన్నారు. ఏపీకి న్యాయం చేయాలని తాను కేంద్రాన్ని పలుమార్లు కోరానన్నారు. ఏపీని కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
అందుకే జాతీయ మీడియాకు చెబుతున్నా
నీతి అయోగ్ సిఫార్సు మేరకు తాము పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టామని చంద్రబాబు చెప్పారు. పోలవరంకు సంబంధించి డీపీఆర్ 2ను కేంద్రం ఆమోదించాల్సి ఉందన్నారు. పోలవరం ఖర్చు కేంద్రమే భరిస్తోందన్నారు. తాము నిధులు పంపించామని, కానీ యూసీలు ఇవ్వడం లేదని కేంద్రమంత్రులు చెప్పడం విడ్డూరమని ఆగ్రహించారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణలు చేస్తోందని, అందుకే తాను జాతీయ మీడియాకు చెబుతున్నానని తెలిపారు. అమరావతి రాజధానికి రూ.2500 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. యూసీలు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పడం విడ్డూరమన్నారు.
అలా చేస్తే 30 ఏళ్లు పడుతుంది
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తాను ఇప్పుడు అడగడం లేదని చంద్రబాబు అన్నారు. ఎందుకంటే తాను రాజకీయ దురుద్దేశ్యాలతో వీటిని అడుగుతున్నట్లుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి సమాచారం ఇవ్వకుండానే వెనక్కి తీసుకున్నారని చెప్పారు. పీఎంవో ఒప్పుకోలేదని వెనక్కి తీసుకోలేదని చెబుతున్నారన్నారు. జాతీయ విద్యా సంస్థలకు చాలా తక్కువ నిధులు ఇచ్చాయన్నారు. ఇలా ఇస్తే ఆ విద్యా సంస్థల ఏర్పాటుకు 30 ఏళ్లు పడుతుందన్నారు. చివరిసారి ప్రయత్నం చేసినా కేంద్రం తీరు మారలేదన్నారు. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని ఏపీకి కడతామని చెప్పారన్నారు. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలని, ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లడం ఎందుకన్నారు.