మోడీ! ది బ్రాండ్: ప్రధానిపై చంద్రబాబు ప్రశంసల వర్షం
ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఛండీగఢ్లో జరిగిన ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్ - 2047పై చర్చలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ మౌలిక వసతుల కల్పన, పేదరికం లేని సమాజం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన, తక్కువ రేటుకే విద్యుత్, రవాణా ఖర్చులు తగ్గించడం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, జనాభా నిర్వహణ, నదుల అనుసంధానం, సాంకేతిక సమ్మేళనం తదితర అంశాలపై ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి, చేపట్టిన కార్యక్రమాలతో భారతదేశం ఆర్థికంగా బలమైన శక్తిగా మారుతోందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం తీసుకొచ్చిన కార్యక్రమాలతో ప్రపంచంలోనే 2,3 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతోందని ప్రశంసించారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారనేందుకు హర్యానా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అంతేగాక, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దృఢమైన నిర్ణయాలు, సుపరిపాలన, మంచి రాజకీయాలు, ప్రత్యేక ఆకర్షణ, కమ్యూనికేషన్ తదితర అంశాలే ప్రధాని మోడీని విజయవంతమైన నేతగా నిలిపాయన్నారు.ఎంతో మంది ప్రధానులు వచ్చినా.. ప్రపంచంలో భారతదేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మాత్రం మోడీనేనని చంద్రబాబు కొనియాడారు.
Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh, JanaSena Chief, Sri @PawanKalyan garu attended the "NDA Chief Ministers and Deputy Chief Ministers' Council Meeting" chaired by Hon'ble Prime Minister Sri @narendramodi ji in Chandigarh, Haryana today.#NDAMeet #Haryana… pic.twitter.com/TjwbHHMJpR
— JanaSena Party (@JanaSenaParty) October 17, 2024
గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మోడీ ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజలతో మోడీకి ఉన్న అనుబంధం, ఆకాంక్షలను ఇది తెలియజేస్తుందన్నారు. కెప్టెన్గా ప్రధాని మోడీ తన ఆలోచనతో వికసిత్ భారత్ - 2047 దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. అందరం మోడీకి మద్దతుగా నిలబడదామని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏఐ వినియోగంతోపాటు పలు అభివృద్ధి అంశాలు, పథకాలపైనా చంద్రబాబు వివరించారు. కాగా, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి చంద్రబాబుతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications