అమెరికా నుంచి చంద్రబాబు ఆదేశాలు: హోదాపై కేంద్రాన్ని తిట్టలేమని లోకేష్
మిర్చి కొనుగోళ్లపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మిర్చి కొనుగోళ్లపై సమీక్షించారు.
అమరావతి: మిర్చి కొనుగోళ్లపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మిర్చి కొనుగోళ్లపై సమీక్షించారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చివరి రైతు, చివరి బస్తా వరకూ వాటిని కొనే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు దూరా భారం తగ్గించే ప్రయత్నాలు చేయాలన్నారు.
ఇందుకోసం కర్నూలు, ఒంగోలు, చిలకలూరిపేటలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, వెంటనే వాటిని రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
శని, ఆది వారాల్లోనూ మిర్చి కొనుగోలు చేయాలని, ఇందుకు హమాలీలకు అదనపు భత్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. కొనుగోళ్ల గడువు పెంచాలని ఆదేశించారు.
క్వింటాల్ మిర్చికి రూ.8వేలు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని, సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా అదనంగా రూ.1500 చెల్లించాలన్నారు.
ఈ సందర్భంగా నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
కాగా, మిర్చి కొనుగోలు విషయంలో కేంద్రం రూ.5 వేలు, ఇతర ఖర్చులు కలిపి రూ.1250.. మొత్తం రూ.6250 ఇచ్చేందుకు సిద్ధమయింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీరును తప్పుబట్టింది.
ఏపీ మంత్రులు కూడా మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు మద్దతు ధర రూ.8వేలు వచ్చేలా చేయాలని అధికారులను ఆదిశించారు.
హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని తిట్టలేం: లోకేష్
ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని విమర్శించే లేదా తిట్టే పరిస్థితి లేదనీ, అంతకంటే మెరుగైన ప్యాకేజీనే రాష్ట్రానికి ఇచ్చారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, జీఎస్టీ అమలు నేపథ్యంలో దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్రానికి రూ. 25వేల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ నిధుల్లో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం కోసం ఇతర నిధుల విషయంలోను సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. జగన్ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.