మా పవన్ నే బెదిరిస్తారా ? తెలంగాణ పార్టీలపై చంద్రబాబు ఫైర్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) పై తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీల నేతలు బెదిరింపులకు దిగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఇవాళ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు మంచి విధానం కాదన్నారు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదని వారికి హితవు పలికారు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందని, రెండు రాష్ట్రాలుగా విడిపోయామని, తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరన్నారు.
ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ లోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారన్నారు. తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని, అక్కడికి కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాల నేతలతో పాటు అన్ని ప్రాంతాల నేతలు వచ్చారన్నారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉందన్నారు. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టారని,. విస్తరిస్తాం అన్నారని, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇది కరెక్ట్ కాదన్నారు.

అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారని, అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో, వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారన్నారు. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు హితవు పలికారు.












Click it and Unblock the Notifications