ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కృతజ్ఢతలు: హోంమంత్రికి లేఖ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఇండియా పొలిటికల్ మ్యాప్లో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖలు రాశారు. 'కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2న విడుదల చేసిన మ్యాప్లో అమరావతి లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా 2015 అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన జరిగింది' అని చంద్రబాబు తెలిపారు.
అంతేగాక, 'ఆ మ్యాప్లో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రజా రాజధాని లేకపోవడం బాధించింది' అని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటు ద్వారా కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
తప్పును సరిచేశామంటూ..
ఏపీ సభ్యులు లోక్ సభలో లేవనెత్తిన అనేక ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి శుక్రవారం సమాధానాలను ఇచ్చారు. రాజధాని అమరావతిని గుర్తించకపోవడంలో పొరపాటు జరిగిందే తప్ప అది ఉద్దేశపూరకంగా చోటు చేసుకున్న ఉదంతం కాదని అన్నారు. దీన్ని తాను సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, తప్పును సరి చేశామని చెప్పారు. తాజాగా మ్యాప్ ను విడుదల చేస్తామని అన్నారు. అదే సమయంలో తన ట్విట్టర్ లో కొత్త మ్యాప్ ను ఆయన విడుదల చేశారు.