ఇల్లు మారనున్న చంద్రబాబు, రాముడిని దర్శించుకున్న జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇల్లు మారనున్నారు. ఆయన జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 25లోని అద్దె ఇంటికి మారనున్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఇంటిని కూల్చివేసి, కొత్త ఇంటిని నిర్మించుకోనున్నారు.
కోదండరామ స్వామిని దర్శించుకున్న జగన్
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామిని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. కోదండరామ స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నన్ను అవమానించారు: విప్ మేడా
ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వేడకల్లో తనను అవమానించారంటూ అధికారులపై ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలను కూడా అనుమతించలేదని మండిపడ్డారు.
ప్రభుత్వ వాహనం, సౌకర్యాలు వదులుకుంటానని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోనన్న విప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న సెక్యూరిటీని విప్ మేడా వెనక్కి పంపించారు. అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని సమాచారం. అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.