కక్షసాధింపు చర్యలతో భయపెడతారా?: మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సంబంధం లేని అంశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.
వైసీపీవి వికృత రాజకీయాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పతనమవుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై వైసీసీ సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వారి వికృత రాజకీయాలతో ప్రజలను భయపెడుతోందని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి ఆయన్ను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అక్రమ కేసులతో గొంతునొక్కలేరు
అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. కాగా, శుక్రవారం ఉదయం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పలువురు టీడీపీ నేతలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
బావ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు
కాగా, రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. ఈ కేసులో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లిని అరెస్ట్ చేశారు. మొదట వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కాకినాడ సబ్ జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అధికార పార్టీ తమ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామకృష్ణారెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ నిరసనలు చేపట్టారు.