పవన్ కళ్యాణ్ కూర్చోవాలో.. నిల్చువాలో.. మీరే చెబుతారా?: చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: విశాఖపట్నంలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు.

పవన్కు అది కూడా పోలీసులే చెబుతారా? అంటూ చంద్రబాబు
జనసేన పార్టీ 'జనవాణి'ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చేయాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

పవన్ బస చేసిన హోటళ్లపై సోదాలా?: చంద్రబాబు
పవన్ బస చేసిన హోటల్లో సోదాలు, బెదిరింపులు నియంత పాలనకు నిదర్శనమన్నారు చంద్రబాబు. విశాఖ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు ప్రయాణిస్తున్న కార్లపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులంటూ నారా లోకేష్
మరోవైపు, టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ పరిణామాలపై స్పందించారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గదులను సోదా చేయడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. విశాఖ గర్జన వైఫల్యం కావడంతోనే ఆ ఉక్రోశం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications