విభజనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా,అద్వానీని అడిగా: బాబు సంచలనం
జూన్ 2 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటి రోజు అని, విభజన జరిగిన తీరును తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలనే ఈ నవ నిర్మాణ దీక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ: జూన్ 2 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటి రోజు అని, విభజన జరిగిన తీరును తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలనే ఈ నవ నిర్మాణ దీక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
శుక్రవారం విజయవాడ బెంజ్ సర్కీల్ వద్ద నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. జ్యోతి ప్రజల్వనల చేసి ప్రారంభించారు. అనంతరం అందరితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడారు.
ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయన్నారు. ఈ రోజు రాష్ట్రానికి చీకటి రోజు అని, జీవితంలో మరిచిపోలేని రోజు అన్నారు. ఇలాంటి రోజును మళ్లీ చూడమన్నారు. ఇలాంటి మండుటెండల్లో ఇంతమంది వచ్చారంటే.. జీవితంలో ఈ రోజును మరిచిపోవద్దనే అన్నారు.
డోర్లు మూసి విభజన, రాజధానికి రూ.5లక్షల కోట్లు, 20 ఏళ్లు: బాబు
మళ్లీ రాష్ట్ర అభివృద్ధికి పునరింకితం అయ్యేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని రాష్ట్రాలు అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయని, దేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని, మనం మాత్రం నవ నిర్మాణ దీక్షను జరుపుకుంటున్నామన్నారు.
పడరాని అవమానాలు పడ్డాం
మనం పడరాని అవమానాలు పడ్డామని, అన్యాయాన్ని తలుచుకొని బాధపడితే లాభం లేదన్నారు. సంక్షోభాన్ని సవాల్గా తీసుకోవాలన్నారు. జపాన్, జపాన్ లాంటి దేశాలను ఆధర్శంగా తీసుకోవచ్చన్నారు. వారు సమస్యలు ఎదుర్కొని అభివృద్ధి చెందారన్నారు.
ఈ నవ నిర్మాణ దీక్ష కూడా అలాంటిదే అన్నారు. స్వాతంత్రానికి ముందు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉండేదని, చెన్నై నుంచి పరిపాలన సాగేదన్నారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు వారి కోసం రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేశారన్నారు.
చెన్నైని అభివృద్ధి చేశాం
అప్పుడు తెలుగువారికి అంటూ ఓ రాష్ట్రం వచ్చిందన్నారు. ఆ రోజు కట్టుబట్టలతో చెన్నై నుంచి కర్నూలుకు వచ్చామన్నారు. చెన్నై అభివృద్ధికి మనం ఎంతో కష్టపడ్డామన్నారు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చామన్నారు.
ఈ రోజుకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజు అని అడిగే పరిస్థితులు ఉన్నాయన్నారు. విభజన సమయంలో ఎవరికీ అన్యాయం చేయవద్దని తాను ఢిల్లీ పెద్దలకు సూచించానన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పానన్నారు.
యుద్ధవిమానంలో పంపారు
సాధారణంగా గంటకోసారి వచ్చే విమానంలో విభజన బిల్లును పంపించకుండా, యుద్ధ విమానంలో దానిని పంపించారని అంటారు. ప్రశాంత వాతావరణంలో విభజన జరగాలని చెప్పానన్నారు.
నా మీద కోపం ఉంటే..
ఆ రోజు తాను ప్రతిపక్ష నేతను అని, తొమ్మిదేళ్లు సీఎంగా పని చేశానని, తనపై కోపం ఉంటే, నేను అంటే మీకు ఇష్టం లేకుంటే రెండు రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్న నేతలతో సంప్రదింపులు జరపాలని, న్యాయం చేయాలని కోరానని చెప్పారు
విభజనపై చర్చించేందుకు కాంగ్రెస్ పెద్దలు వార్ రూం ఏర్పాటు చేశారని, ఎవరి పైన యుద్ధం చేసేందుకు ఈ వార్ రూం అని ఆనాడో అడిగానని చెప్పారు. ఆ రోజు తాను దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులను కలిసి, న్యాయం చేయాలని చెప్పానన్నారు.
ఇది న్యాయమా అని అద్వానీని అడిగా
విభజన చేయాలనుకుంటే సమన్యాయం చేయాలని అడిగానని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని చెప్పానన్నారు. పార్లమెంటు విభజన సమయంలో తాను అక్కడే ఉన్నానని, డోర్లు క్లోజ్ చేసి బిల్లును ప్రవేశ పెట్టారన్నారు. డోర్లు క్లోజ్ చేసి బిల్లు పెట్టడం ఏమిటని తాను అద్వానీని అడిగానని, ఆయన కూడా అది తప్పే అన్నారని చెప్పారు.
ఇటలీ స్వాతంత్ర దినమే.. మనకు చీకటి దినం
జూన్ 2 ఇటలీ స్వాతంత్ర దినోత్సవం అని, ఆ రోజు ఇక్కడ మనకు చీకటి రోజు అని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. ఓ పక్క రాజకీయ ప్రయోజనాలు, రెండోది ఎన్టీఆర్ పోరాటం వల్ల కాంగ్రెస్కు ఆయన సింహస్వప్నం అయ్యారన్నారు. అందుకే కంటగింపు అని అభిప్రాయపడ్డారు.
విభజన సమయంలో మనం లోటు బడ్జెట్తో ఉన్నామన్నారు. విజయవాడ నుంచే పరిపాలించానని నిర్ణయించుకున్నానని చంద్రబాబు చెప్పారు. తొలుత బస్సులోనే తన ఆఫీస్ అన్నారు.
హేతుబద్ధత లేని విభజన చేసి, చిచ్చు పెట్టారన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ఎన్జీవోలు కూడా ఉద్యమించారన్నారు. మన పొట్ట కొట్టిన వారు రాష్ట్రంలో లేకుండా పోయారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పొత్తుపై..
బిజెపి, టిడిపిలు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుందని ఎన్డీయేలో చేరామన్నారు. గతంలో వాజపేయి హయాంలోను ఎన్డీయేల ఉన్నామని చెప్పారు. మనం ఎప్పుడూ పదవుల కోసం ఆశించలేదన్నారు.
దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ, రాష్ట్రం బాగుపడాలంటే టిడిపి కావాలని తాను ఆశించానని చెప్పారు. ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలన్నారు.
పోలవరం, అమరావతి తనకు రెండు కళ్లు అన్నారు. మన పొట్ట కొట్టిన వాళ్లు అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణాదిలో అయిదో స్థానంలో ఉన్నామని చెప్పారు. విజయవాడ భవిష్యత్తులో సుందర నగరంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరికి నీటి భద్రత కల్పిస్తామన్నారు. ఏపీని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తామన్నారు.